జాస్మిన్ మృతిపై వీడని మిస్టరీ: శ్రీసాయికి కన్నీటి వీడ్కోలు, కొనసాగుతున్న దర్యాప్తు
అమరావతి: గంటూరు జిల్లా రేపల్లే మండలం నిజాంపట్నం మండలం అడవులదీవి గ్రామంలో ఆదివారం చోటుచేసుకున్న షేక్ జాస్మిన్, వేముల శ్రీసాయి మృతి మిస్టరీ ఇంకా వీడలేదు. జాస్మిన్ అనుమానాస్పద మృతి ఘటనలో నిందితులుగా ఉన్న వేముల శ్రీసాయి, జొన్న పవన్కుమార్లను చెట్టుకు కట్టేసి కొట్టడంతో శ్రీసాయి మృతిచెందిన సంగతి తెలిసిందే.
జాస్మిన్ బంధువులు తీవ్రంగా కొట్టటం వల్లే శ్రీసాయి మృతి చెందాడని పోలీసులు నిర్ధారించారు. శ్రీసాయి మృతి కేసులో జాస్మిన్ అన్న సాదుల్లాతో పాటు ఆమె బాబాయిలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరికొంత మందిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు.
ఈ మొత్తం వ్యవహారంపై పోలీసులు పూర్తిస్థాయిలో విచారిస్తున్నారు. శ్రీసాయి మృతి కేసులో విచారణ ఒక కొలిక్కి వచ్చినట్లేననే పోలీసులు అంటున్నారు. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న పవనకుమార్ ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. ఆదివారం జాస్మిన్ తన పుట్టినరోజని, ఇంట్లో ఎవరు లేరని, రావాలని శ్రీసాయికి ఆమె స్నేహితురాలితో ఫోన్ చేయించిందని పవన్ తెలిపాడు.
జాస్మిన్, శ్రీసాయి కొంత కాలంగా ప్రేమించుకుంటున్న విషయం వాస్తవమని, దీంతో శ్రీసాయి, తాను జాస్మిన్ ఇంటికి వెళ్లామని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మరోవైపు జాస్మిన్, శ్రీసాయి కాల్ డేటా ఆధారంగా ఘటన జరిగిన రోజు జాస్మిన్ శ్రీసాయికి రెండుసార్లు ఫోన్ చేసి పిలిపించినట్లు పోలీసులు నిర్ధారించారు.
శ్రీసాయి మొదటిసారి ఆమె ఇంటికి వెళ్లినప్పుడు, ఆమె బాబాయి మందలించి పంపినట్లు తెలుస్తోంది. పెళ్లి సంబంధం మాట్లాడేందుకు కుటుంబసభ్యులు వేరే ఊరికి వెళ్లిన సమయంలో శ్రీసాయి ఇంటికి ఎందుకు వచ్చాడంటూ జాస్మిన్ను కూడా తిట్టడంతో పాటు జరిగిన విషయాన్ని ఆమె అన్న సాదుల్లాకు చెప్పినట్లు పోలీసులు విచారణలో నిర్ధారించారు.
దీంతో సాదుల్లా అక్కడి నుంచే చెల్లెలు జాస్మిన్కు ఫోన్ చేసి మందలించాడు. దీంతో భయపడిన జాస్మిన తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు శ్రీసాయికి ఫోన్ చేసి చెప్పిందని.. వెంటనే శ్రీసాయి, పవన్ వెళ్లి జాస్మిన్ స్నేహితురాలిని కలిసి విషయం చెప్పి వెళ్లి ఏమి చేస్తుందో చూసి రావాలని పంపారు.
అమె ఇంట్లోకి చూసే సరికి జాస్మిన్ ఫ్యాన్కు ఉరి పెట్టుకుని ఉన్నట్లు వచ్చి చెప్పిందని, వెంటనే వెళ్లి పక్కనే ఉన్న ఇద్దరు వృద్ధులకు విషయం చెప్పి, ఇంట్లోకి వెళ్లి జాస్మిన్ ఉరి పోసుకున్న చీరను శ్రీసాయి ఒక్కడే తొలగించి, 108కు ఫోన్ చేశాడని పవన్ పోలీసులకు చెప్పినట్లు తెలిసింది.
ఇంతలో అక్కడికి వచ్చిన గౌస్ అనే వ్యక్తి తమను ఇంట్లోకి నెట్టి ఇంటి తలుపులకు గడియపెట్టినట్లు చెప్పడం కూడా తెలిసిందే. అయితే ఆమె మృతదేహంపై ఎటువంటి గాయాలూ లేవని, మెడ వద్ద ఒత్తుకుపోయినట్లు ఉందని తెలియడంతో జాస్మిన్ది ఆత్మహత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు.
మరోవైపు జాస్మిన్ పోస్టుమార్టం రిపోర్టుపై పలు రకాలుగా చర్చ సాగుతోంది. పోస్టుమార్టం ప్రాథమిక రిపోర్టు వైద్యాధికారుల నుంచి అందలేదని, రెండు రోజుల్లో వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. జాస్మిన్, శ్రీసాయి మృతిపై కేసులు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారిస్తున్నామని డీఎస్పీ పి.మహేష్ తెలిపారు.
మరోవైపు మహ్మదీయపాలెం గ్రామస్తుల చేతిలో మృతి చెందిన వేముల శ్రీసాయికి కుటుంబ సభ్యులు, బంధువులు మంగళవారం కన్నీటి వీడ్కోలు పలికారు. అడవులదీవి గ్రామంలో శ్రీసాయి అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల సందర్భంగా శ్రీసాయి వర్గీయులు గ్రామంలో దుకాణాలు మూయించి ఊరేగింపు నిర్వహించారు. జాస్మిన్, వేముల శ్రీసాయి మృతితో రెండు రోజులుగా అడవులదీవిలో సెక్షన్-144 అమల్లో ఉన్న సంగతి తెలిసిందే.