ఏపీలో ఆరోగ్యశ్రీ కింద కరోనా ట్రీట్మెంట్: ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ వైద్యం: రేట్ ఫిక్స్
అమరావతి: ప్రాణాంతక కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తోన్న వేళ.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చింది. కరోనా బారిన పడిన వారికి అందించే వైద్యంతో పాటు ఆ లక్షణాలు కనిపించిన వారికి నిర్వహించే పరీక్షలను కూడా దీని కిందికి తీసుకొచ్చింది. రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతం కావడం, పేషెంట్లకు మెరుగైన చికిత్సను అందించడం, చాలినన్ని పడకలను ఏర్పాటు చేయడంలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
Recommended Video
నిమగడ్డ కేసుపై సుప్రీం కీలక ఆదేశాలు..వ్యాఖ్యలు: జగన్ సర్కార్ విజ్ఙప్తికి నో: 3 వారాల తరువాతే
ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ట్రీట్మెంట్
ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా చికిత్సను చేయించుకోవడానికి అనుమతి ఇచ్చింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి విడుదల చేశారు. కరోనా వైరస్ ట్రీట్మెంట్కు అయ్యే ఫీజులను నిర్ధారించారు. కరోనా బారిన పడిన పేషెంట్కు అందించే ట్రీట్మెంట్కు ఏ స్థాయిలో ఎంత మొత్తాన్ని వసూలు చేయాలో స్పష్టం చేశారు. ఇకపై ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులన్నింటిలోనూ కరోనా పేషెంట్లకు వైద్యాన్ని అందిస్తారని జీవోలో పేర్కొన్నారు. తాము నిర్ణయించిన మొత్తానికి లోబడి పేషెంట్ల నుంచి ఫీజులను వసూలు చేయాల్సి ఉంటుందని ఆదేశించారు.
ఫీజులు ఇలా..
నాన్ క్రిటికల్ కరోనా చికత్సకు రోజుకు 3,250 రూపాయలు, క్రిటికల్ పేషెంట్లకు ఐసీయూలో అందించే చికిత్స కోసం ఆక్సిజన్ సరఫరాతో కలిపి అందించే చికిత్సకు రోజుకు 5,980 రూపాయల మొత్తాన్ని నిర్ధారించారు. ఐసీయూలో వెంటిలేటర్తో అందించే చికిత్స కోసం రోజుకు 9,580 రూపాయలను వసూలు చేయాలని జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. వెంటిలేటర్ లేకుండా ఐసీయూలో చికిత్సకు రోజుకు 5,480 రూపాయలు, ఐసీయూలో క్రిటికల్ కేర్ చికిత్సకు 10,380, వెంటిలేటర్ లేకుండా చికిత్సకు రోజుకు 6,280 రూపాయలను ఫీజు రూపంలో తీసుకోవాల్సి ఉంటుందని సూచించారు.
కరోనా వైరస్ ఉధృతమౌతోన్న కారణంగా..
రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ భారీగా పెరిగిపోతున్నాయి. లాక్డౌన్ సడలింపులను అమల్లోకి తీసుకొచ్చిన తరువాత రోజూ వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఫలితంగా ప్రభుత్వ ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్లలో పడకల కొరత ఏర్పడుతోందని ప్రభుత్వం భావించింది. దీనికితోడు- కరోనా పేషెంట్లకు మరింత నాణ్యమైన వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతో ఇక ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ కరోనా రోగులకు ట్రీట్మెంట్ను అందించాలని నిర్ణయించింది.
కేటగిరీవారీగా ఆసుపత్రులు..
రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రులను కరోనా పరిధిలోకి తీసుకొచ్చింది ప్రభుత్వం. వాటిని మూడు కేటగిరీలుగా మార్చాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశించింది. కరోనా పేషెంట్ల మాత్రమే ట్రీట్మెంట్ ఇచ్చే ఆసుపత్రులను కేటగిరీ-ఏ పరిధిలో చేర్చింది. కోవిడ్, నాన్ కోవిడ్ పేషెంట్లకు కలిపి ట్రీట్మెంట్ ఇచ్చే ఆసుపత్రులను కేటగిరీ-బీగా గుర్తించింది. నాన్ కోవిడ్ పేషెంట్లు..అంటే సాధారణ రోగాలకు చికిత్స అందించే ప్రైవేటు ఆసుపత్రులను కేటగిరీ-సీలోకి తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన ప్రక్రియను వెంటనే చేపట్టాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలను జారీ చేసింది ప్రభుత్వం.