పెద్దల సభకు ఎన్నికలు రేపే: వర్ల రామయ్యపైనే అందరి దృష్టి: బలం లేకపోయినా బరిలో
అమరావతి: ఇంకొక్కరోజే. రాజ్యసభ ఎన్నికల ముహూర్తం సమీపించింది. శుక్రవారం రాజ్యసభ సభ్యులను ఎన్నుకోవడానికి పోలింగ్ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో నాలుగు స్థానాలకు అయిదుమంది రేసులో ఉన్నందున ఎన్నికలు తప్పనసరి అయ్యాయి. శాసనసభ్యులు ప్రాధాన్యత క్రమంలో రాజ్యసభ అభ్యర్థులను ఎన్నుకుంటారు. ఉదయం 9 గంటల నుంచి అసెంబ్లీ ఆవరణలో ఎన్నికలను నిర్వహిస్తారు. దీనికి అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు.
పాక్, చైనా ఓటు కూడా భారత్కే: ఐరాస భద్రతామండలి ఎన్నికల్లో ఘనవిజయం..సభ్యత్వం: ఏడాది
పోటీలో ఉన్నది వీరే..
రాజ్యసభ ఎన్నికల బరిలో మొత్తం అయిదు మంది అభ్యర్థులు నిల్చున్నారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నలుగురు, తెలుగుదేశం తరఫున ఒకరు పోటీ చేస్తున్నారు. వైసీపీ సీనియర్ నాయకులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, అయోధ్యా రామిరెడ్డిలతో పాటు పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ సన్నిహితుడు పరిమళ్ నత్వాని అధికార పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. టీడీపీ తరఫున ఆ పార్టీ పొలిట్ బ్యురో సభ్యుడు వర్ల రామయ్య తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పరిమళ్ నత్వానీకి రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలంటూ స్వయంగా ముఖేష్ అంబానీ..ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు.
ఖాళీ అయిన ఆ నాలుగు స్థానాలివే..
ఏపీలో నాలుగు, తెలంగాణ రెండు రాజ్యసభ స్థానాలు ఏకకాలంలో ఖాళీ కానున్నాయి. కేంద్ర మాజీమంత్రి టీ సుబ్బరామి రెడ్డి (కాంగ్రెస్), తోట సీతా రామలక్ష్మి (తెలుగుదేశం), కే కేశవరావు (తెలంగాణ రాష్ట్ర సమితి) మహ్మద్ అలీఖాన్ పదవీ కాలం ముగిసింది. ఏప్రిల్ 9వ తేదీన వారి పదవీ కాలం ముగుస్తుంది. ఈ నలుగురిలో కే కేశవరావు, మహ్మద్ అలీఖాన్ ఇద్దరూ తెలంగాణకు చెందిన నాయకులు. రాష్ట్ర విభజన అనంతరం నిర్వహించిన డ్రాలో వారిద్దరూ ఏపీ కోటా కిందికి వచ్చారు. తెలంగాణ నుంచి కేవీపీ రామచంద్ర రావు (కాంగ్రెస్), గరికపాటి మోహన రావు (తెలుగుదేశం) పదవీ కాలం ముగిసింది.
నాలుగు స్థానాలకు అయిదుమంది అభ్యర్థులు..
రాష్ట్రం నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న కోటాలో నాలుగు స్థానాలు ఖాళీ అయ్యాయి. శాసనసభలో ఇప్పుడు ఉన్న సభ్యుల బలబలాల ఆధారంగా చూసుకుంటే.. నాలుగుకు నాలుగూ వైఎస్ఆర్సీపీ ఖాతాలో చేరుతాయి. తమ నలుగురు అభ్యర్థులను కూడా గెలిపించుకోవడానికి అవసరమైన శాసనసభ్యుల బలం ఆ పార్టీకి ఉంది. అయిదో అభ్యర్థిగా వర్ల రామయ్య బరిలో లేకపోయి ఉంటే.. ఈ నాలుగూ ఏకగ్రీవంగా ఎంపిక కావాల్సి ఉన్నవే. తెలుగుదేశం పార్టీ తరఫున వర్ల రామయ్య పోటీలో ఉండటం వల్ల పోలింగ్ నిర్వహించాల్సి వస్తోంది.
బలం లేకపోయినా..
తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధించడానికి అవసరమైనంత బలం లేదు. సభ్యులు విజయం సాధించడానికి 34 మంది శాసనసభ్యులు ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయాల్సి ఉంటుంది. టీడీపీకి ఉన్న బలం 23. అందులోనూ ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ దూరం అయ్యారు. కృష్ణాజిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గుంటూరు పశ్చిమ శాసన సభ్యుడు మద్దాలి గిరిధర్ రావు ఓటింగ్లో పాల్గొనట్లేదు. మరో ఎమ్మెల్యే కరణం బలరాం ఇప్పటికే వైసీపీకి మద్దతు ప్రకటించినందున.. ఆయన ఓటు అధికార పార్టీ అభ్యర్థికే పడే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో నాలుగు స్థానాలనూ వైసీపీ గెలుచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
Recommended Video
దేశవ్యాప్తంగా 55 స్థానాలకు..
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా 55 రాజ్యసభ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తారు. నిజానికి ఏప్రిల్లోనే ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ.. కరోనా వైరస్ వ్యాప్తి చెందడం వల్ల వాయిదా వేయాల్సి వచ్చింది. అనంతరం ఈ ఎన్నికలను కేంద్ర ఎన్నికల కమిషనర్ రీ షెడ్యూల్ చేసింది. శుక్రవారం నిర్వహించబోతున్నట్లు కొద్దిరోజుల కిందటే నోటిఫికేషన్ విడుదల చేసింది. అన్ని ప్రధాన పార్టీల నుంచి సీనియర్ నాయకులు పెద్దలసభకు ఎన్నిక కాబోతున్నారు. కర్ణాటక నుంచి మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవేగౌడ, కేంద్ర మాజీమంత్రి మల్లికార్జున ఖర్గే రాజ్యసభ ఎన్నికల బరిలో ఉన్నారు.