ఏపీలో కొత్తగా 12 వేలకు పైగా కరోనా కేసులు: ఆ జిల్లాలపై పంజా
అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రతకు అడ్డుకట్ట పడట్లేదు. నైట్ కర్ఫ్యూ విధించినా దాని తీవ్రత మరింత పెరుగుతోంది. రోజురోజూ కొత్త కేసుల వెల్లువ కొనసాగుతోంది. అన్ని జిల్లాల్లోనూ కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. ప్రత్యేకించి- అయిదు జిల్లాలపై మహమ్మారి పంజా విసిరింది. రెండు చోట్ల రెండు వేలకు పైగా.. మిగిలిన మూడు జిల్లాల్లో వెయ్యికి పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య కూడా పెరిగింది. కొత్తగా అయిదుమంది ఈ వైరస్కు బలి అయ్యారు.
వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తాజాగా విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో 12,615 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయిదుమంది మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా రెట్టింపయింది. 50 వేలను దాటేసింది. 53,871గా రికార్డయ్యాయి. ఇప్పటిదాకా కోవిడ్ వల్ల మరణించిన వారి సంఖ్య 14,527కు చేరింది. చిత్తూరు, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
చిత్తూరులో అత్యధికంగా 2,338 పాజిటివ్ కేసులు నమోదు కావడం అక్కడి తీవ్రతకు అద్దం పడుతోంది. విశాఖపట్నంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ జిల్లాలో కొత్తగా 24 గంటల వ్యవధిలో 2,117 కేసులు వెలుగులోకి వచ్చాయి. గుంటూరు-1,066, విజయనగరం-1,039, నెల్లూరు-1,022 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు బులెటిన్లో పేర్కొన్నారు. విశాఖపట్నంలో ముగ్గురు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.
అనంతపురం-951, తూర్పు గోదావరి-627, కడప-685, కృష్ణా-363, కర్నూలు-884, ప్రకాశం-853, శ్రీకాకుళం-464, పశ్చిమ గోదావరి-216 కేసులు నమోదయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రమే కాస్త తక్కువగా కేసులు రికార్డయ్యాయి. ఈ పరిణామాల మధ్య రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ ఆంక్షలను అమలులోకి తీసుకొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా నైట్ కర్ఫ్యూను అమలు చేస్తోంది. ఒకవంక రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. పాఠశాలలు, కళాశాలలకు సెలవును ప్రకటించకపోవడం పట్ల వ్యతిరేకత ఎదురవుతోంది.