అనంతపురం జెఎన్టీయూ క్యాంపస్ స్టేట్ బ్యాంకు బ్రాంచిలో భారీ దోపిడీ:పక్కా స్కెచ్ తోనే!
అనంతపురం:అనంతపురంలోని జెఎన్టీయూ క్యాంపస్లో ఉన్నస్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ లో భారీ దోపీడీ జరిగింది. పక్కా ప్లాన్ ప్రకారం స్ట్రాంగ్ రూమ్ తలుపులు కోసి మరీ దుండగులు దోపిడీకి పాల్పడిన తీరు సంచలనం సృష్టిస్తోంది.
శనివారం ఉదయం బ్యాంకులో చోరీ జరిగిందని గుర్తించిన బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భారీ దోపిడీ గురించి సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. చోరీ జరిగిన తీరును బట్టి ఈ బ్యాంకుపై బాగా అవగాహన ఉన్నవారే ఈ దోపిడీకి పాల్పడటమో...లేక బ్యాంకు కు సంబంధించిన వారి సహకారంతోనో ఈ దొంగతనం చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఎస్బిఐలో చోరీ...ఇలా తెలిసింది
అనంతపురం డీఎస్పీ వెంకట్రావు, బ్యాంకు మేనేజర్ శర్మ కథనం మేరకు ఈ దోపిడీ జరిగిన తీరు ఇది...రోజువారీ విధులు ముగిసిన తర్వాత శుక్రవారం రాత్రి 7:30 గంటల సమయంలో మేనేజర్ శర్మ బ్యాంకుకు తాళాలు వేసి ఇంటికి వెళ్లిపోయారు. ఆ తరువాత ఆయన శనివారం ఉదయం 9:30 గంటలకు తిరిగి బ్యాంకు తాళాలు తీసి లోపలకు వెళ్లగా లాకర్ ముందు సిలిండర్, గ్యాస్ కట్టర్, డ్రిల్లింగ్ మిషన్తోపాటు వైర్లు కనిపించాయి. దీంతో ఆయన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం డీఎస్పీ వెంకట్రావు, సీఐ భాస్కర్రెడ్డి, సిబ్బందితో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. లాకర్కు ఓ వైపు గ్యాస్కట్టర్తో రంధ్రంచేసి ఉండడంతోపాటు అందులో రూ.39 లక్షల డబ్బులు అపహరించినట్లు గుర్తించారు.
చోరీ జరిగిన...తీరు ఇది
బ్యాంకులో చోరీ జరిగిన తీరును సీసీ ఫుటేజీలను బట్టి పరిశీలిస్తే శుక్రవారం అర్ధరాత్రి ఇద్దరు ముసుగు దొంగలు పక్కనే ఉన్న పోస్టాఫీస్ భవనం ప్రహరీ పై నుంచి దూకి బ్యాంకు ఆవరణం లోకి ప్రవేశించారు. ఆ తరువాత బ్యాంకు వెనకవైపు కిటికి గ్రిల్స్ తొలగించి లోపలకి చొరబడ్డారు. గ్యాస్ కట్టర్తో బ్యాంక్ స్ట్రాంగ్రూమ్ను కోసివేసి అందినంత నగదును దోచుకెళ్లారు. బ్యాంకు అధికారులు శనివారం ఉదయం బ్యాంకులో చోరీ జరిగిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పక్కా ప్లాన్ తో...చాలా జాగ్రత్తలు
తమ గురించి ఎలాంటి ఆధారాలు, ఆనవాళ్లు లభించకుండా చేతులకు గ్లౌస్లు, ముఖాలకు మాస్క్లు వేసుకున్న ఇద్దరు దుండగులు బయటనుంచి లోపల ప్రవేశించేందుకు కిటికీ ఇనుప చువ్వలను గ్యాస్కట్టర్తో తొలగించారు. కిటికీకి లోపలివైపు అమర్చిన అద్దాలను పగులగొట్టారు. అర్ధరాత్రి రెండున్నర సమయంలో బ్యాంకు లోపలికి ప్రవేశించి లోపలికి వెళ్లడంతోనే ముందుగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఆ తరువాత అలారాన్ని డిస్ కనెక్ట్చేశారు. బ్యాంకులో 26 సీసీ కెమెరాలు ఉండగా అందులో పదింటిని పగలగొట్టేశారు. టార్చ్లైట్ వెలుగులో లాకర్ తాళాల కోసం వెతికినట్లు సిసి కెమేరాలో కనిపిస్తోంది. అవి దొరక్కపోవడంతో తమ వెంటతెచ్చుకున్న గ్యాస్కట్టర్తో స్ట్రాంగ్ రూమ్ కు రంధ్రంచేసి అందులో ఉన్న డబ్బులను దోచుకుపోయారు. అయితే బ్యాంకు లోపలికి ప్రవేశించిన కొద్ది సమయంలోనే దొంగలు తమ పని పూర్తి చేసుకోని వెళ్లిపోయినట్లు కనిపిస్తోంది.
ఇలా దోచేశారు...మొత్తం ఎంతంటే?
ఇద్దరు దుండగులు బ్యాంకులోకి ప్రవేశించినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. బ్యాంకు స్ట్రాంగ్ రూమ్లో మూడు అరలు ఉన్నాయని.. అందులో నగదు ఉన్న అరకు గ్యాస్ కట్టర్తో రంధ్రం చేసి చేతికి అందినంత దోచుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఆ అరలో మొత్తం రూ.41 లక్షల నగదు ఉందని.. బ్యాంకు అధికారులు చెబుతున్నారు. చోరీకి గురైన సొమ్ము తేల్చేందుకు బ్యాంకు సిబ్బంది డీఎస్పీ వెంకట్రావ్ పర్యవేక్షణలో నగదును లెక్కించారు. రూ.39 లక్షలు చోరీకి గురైనట్లు తేల్చారు. బ్యాంకు మేనేజర్ ఫిర్యాదుతో డీఎస్పీ పర్యవేక్షణలో దొంగల కోసం గాలింపు చర్యలు మొదలయ్యాయి. క్లూస్టీమ్ వేలిముద్రలను సేకరించగా, డాగ్ స్క్వాడ్ పరిసర ప్రాంతాలను పరిశీలించింది. కాగా, దుండగులు బ్యాంకు గురించి అంతా తెలిసినట్లు వేగంగా తమ పని చక్కచెట్టడం, ఈ బ్యాంకుకు సెక్యూరిటీ గార్డును నియమించకపోవడం కూడా అనుమానాలకు తావిస్తున్నాయి.