మావల్లే ప్రపంచంలో తెలుగువారి సత్తా, బీజేపీ అడ్డుపడింది, వారికి నేను సవాల్ చేస్తున్నా: బాబు
విజయవాడ: విభజన తర్వాత ఏపీకి కేంద్రం చేసిన అన్యాయం వల్లే తాము ఎన్డీయే నుంచి బయటకు వచ్చామని ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం అన్నారు. టీడీపీ పండుగ మహానాడులో ఆయన మాట్లాడారు. మహానాడు టీడీపీకి పండుగ రోజు అన్నారు. గతంలో ఎన్నడూ లేనంత స్పందన ఇప్పుడు మహానాడుకు వచ్చిందన్నారు.
తొలిసారి ఇలా, వారి దగ్గరకే భోజనాలు.. మహానాడు ప్రత్యేకతలెన్నో: బీజేపీ, పవన్-జగన్ టార్గెట్!
దేశంలోనే అత్యంత ఎక్కువమంది కార్యకర్తలు ఉన్న ప్రాంతీయ పార్టీ టీడీపీ అన్నారు. 70 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారని చెప్పారు. కార్యకర్తల వల్లే తనకు, ఎన్టీఆర్కు ప్రపంచస్థాయి గుర్తింపు వచ్చిందన్నారు. గతంలో మేం వేసిన ఫౌండేషన్ వల్లే అనేక దేశాల్లో తెలుగు వాళ్లు రాణిస్తున్నారని చెప్పారు.కార్యకర్తల చొరవతోనే పథకాలు, కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్తున్నాయన్నారు.
తెలుగువారి కోసం పోరాడుతున్న పార్టీ టీడీపీ
తనపై నమ్మకంతో ఏపీ ప్రజలు తనకు అధికారం ఇచ్చారని చంద్రబాబు చెప్పారు. ప్రపంచంలో ఎక్కడ తెలుగు వారు ఉన్న వారి కోసం పోరాడుతున్న పార్టీ టీడీపీ అన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో మనం ముందుకు సాగుతున్నామని చెప్పారు. కాంగ్రెస్ పదేళ్ల పాలన పీడకల అని, వైయస్ రాజశేఖర రెడ్డి పాలన అవినీతిమయమని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో 24వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు.
అనుభవం వల్లే అభివృద్ధి చేస్తున్నా
మనలను కొందరు నేతలు విమర్శిస్తున్నారని, వారికి నేను చెప్పదల్చుకున్నానని, నాకు అనుభవం ఉన్నందువల్లే ఇంత అభివృద్ధి చేశానని చెప్పారు. ఇక్కడున్న వారి అందరి సహకారంతో నేను ఏపీని భారతదేశంలో నెంబర్ వన్గా తీర్చిదిద్దుతానని సవాల్ చేస్తున్నానని, ఇప్పటికే అభివృద్ధిలో దూసుకుపోతున్నందుకు గర్విస్తున్నానని చెప్పారు. 2029 నాటికి ఏపీని నెంబర్ వన్గా తీర్చిదిద్దుతానని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక కరెంట్ కష్టాలు లేవన్నారు.
ఏపీకి కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
ఏపీకి కేంద్రం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. హేతుబద్దత లేకుండా రాష్ట్రాన్ని విభజించారన్నారు. తనను విమర్శించే నాయకులకు ఓ విషయం చెప్పదల్చుకున్నానని, వారి పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల కంటే మనం ముందున్నామని చెప్పారు. సంక్రాంతికి, రంజాన్కు, క్రిస్మస్కు ప్రజలకు కానుకలు ఇస్తున్నామని చెప్పారు. అన్ని మతాల పండుగలకు సమ ప్రాధాన్యం ఇచ్చామన్నారు. నాలెడ్జ్ సెంటర్, ఐటీకి ప్రాధాన్యత ఇచ్చామని, ఇస్తున్నామని చెప్పారు. ఆడపిల్లలకు పెళ్లి సమయంలో ఆర్థిక సాయం అందిస్తున్నామని, అవినీతి నిర్మూలనకు పాటుపడుతున్నామని, బ్రాహ్మణ కార్పోరేషన్ ఏర్పాటు చేశామని చెప్పారు.
తెలుగుజాతి గుండెల్లో ఉండే వ్యక్తి ఎన్టీఆర్
టీడీపీ బలహీన వర్గాల పార్టీ అని చంద్రబాబు అన్నారు. ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇస్తామని చెప్పారు. దేశంలో సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికింది ఎన్టీఆరే అన్నారు. అనేక సంస్కరణలతో ఆయన తెలుగువారి ఖ్యాతిని పెంచారన్నారు. తాను 208 రోజుల పాదయాత్రలో ప్రజల కష్టాలను దగ్గర నుంచి చూశానని చెప్పారు. విజయవాడ విజయానికి నాంది అన్నారు. చరిత్ర ఉన్నంత వరకు తెలుగు జాతి గుండెల్లో ఉండే వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. హేతుబద్ధత లేని విభజనతో కాంగ్రెస్ తప్పు చేస్తే, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా బీజేపీ తప్పు చేసిందని, దానికి కాంగ్రెస్ గతే పడుతుందన్నారు. నాలుగేళ్లలో బీజేపీ ఏం చేయకపోగా అడ్డుపడిందన్నారు. ఎప్పుడు ఏ ఎన్నిక వచ్చినా టీడీపీదే గెలుపు అన్నారు. తెలంగాణలో, ఏపీలో గ్రూప్స్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటడానికి టీడీపీయే కారణం అన్నారు.