హైదరాబాద్ నుంచి అమరావతి వెళ్లే ఉద్యోగులకు బంపర్ ఆఫర్
విజయవాడ: హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్లే ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. ముప్పై శాతం హెచ్ఆర్ఏ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.
హెచ్ఆర్ఏ పై ఉత్తర్వులు ఇవ్వడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే అమరావతికి తరలి వెళ్లాలని నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది.
ఏం జరుగుతోంది?: ధీమాగా చంద్రబాబు, అమరావతికి ఉద్యోగులు వెళ్తారా?
కాగా, రాజధాని ప్రాంతంలోని వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ భవనాల పనులను చంద్రబాబు సోమవారం ఉదయం మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, సీఆర్డీఏ అధికారులతో కలిసి సందర్శించారు. భవనాలను నిర్మిస్తోన్న ఎల్ అండ్ టీ, షాపూజీ పల్లోంజీ సంస్థల ప్రతినిధులతో మాట్లాడారు.
ఈ నెల 27వ తేదీ లోపు కొన్ని భవనాల నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి ఒక్క శాఖకు సంబంధించిన కమ్యూనికేషన్స, రికార్డులు వచ్చిన తర్వాతే ఇక్కడికి తరలిస్తామని చెప్పారు.
అది రాలేదు, ఇది రాలేదని నెపాలు పెట్టడం ఉద్యోగులకు తగదన్నారు. ఇకపై వారానికి ఒకసారి వచ్చి పనులు పరిశీలిస్తానన్నారు. ఒక పద్ధతి ప్రకారం ఏ డిపార్టుమెంట్ ఎప్పుడు రావాలో నోటిఫై చేస్తామన్నారు. వెలగపూడికి వచ్చే అప్రోచ రోడ్లు, కాంప్లెక్స్ అంతర్భాగంలోని రోడ్లు అన్నింటినీ సరి చేయమని ఆదేశాలు జారీ చేశామన్నారు.
అదే సమయంలో 29 గ్రామాలను అభివృద్ధి చేయాల్సిందిగా సీఆర్డీఏ అధికారి మల్లికార్జునకు బాధ్యతలు అప్పగించామన్నారు. శాశ్వత భవనాలు కొంచెం జాప్యమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో హెచవోడీలన్నింటిని గుంటూరు, విజయవాడల్లో ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించామన్నారు.
ప్రాంగణంలోని 1,2,5 భవనాల పనులను పరిశీలించారు. తాత్కాలిక సచివాలయం ప్రాంతంలోకి ముఖ్యమంత్రి వస్తున్నట్లు ఆకస్మికంగా తెలియడంతో అధికారులు హైరానా పడ్డారు. ముఖ్యమంత్రి వాహనం నేరుగా బిల్డింగ్ల వద్దకు వెళ్లేందుకు చర్యలు తీసుకున్నారు.