వెలగపూడిలో సచివాలయం ముస్తాబు: 11న చంద్రబాబు చాంబర్
విజయవాడ: ఏపీ ఉద్యోగుల కోసం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం సర్వ హంగులతో ముస్తాబు అయింది. ముఖ్యమంత్రి డెడ్లైన్లు, ఉన్నతాధికారుల ఉత్తర్వులు, ఉద్యోగుల అభ్యంతరాలు, ఆందోళనలు, ఫైళ్ల ప్యాకింగ్ అన్నీ పూర్తయ్యాయి.
ఇప్పుడు ఉద్యోగులంతా వెలగపూడి తరలుతున్నారు. కొంతమంది వచ్చేశారు. హైదరాబాద్ సచివాలయంలో కాస్తా కూస్తో మిగిలిన ఫైళ్లు, ఫర్నీచర్ను శనివారం మూటగట్టేశారు. తెలంగాణ ఉద్యోగులకు వీడ్కోలు పలికారు. సెల్ఫీలు దిగారు. బంధాలను, అనుబంధాలను గుర్తు చేసుకున్నారు.
ఆంధ్రా ఉద్యోగులంతా నవ్యాంధ్ర రాజధానికి తరలుతున్నారు. అక్టోబరు 3వ తేదీ సోమవారం నుంచి నవ్యాంధ్ర పాలన వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం నుంచే సాగనున్నది. ఇప్పటికే మంత్రులంతా వెలగపూడి సచివాలయంలో కార్యాలయాలు ప్రారంభించేశారు.
అధికారిక సమీక్షా సమావేశాలను కూడా నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చాంబర్లు ఈ నెల 11న దసరా పర్వదినాన ప్రారంభం కానున్నాయి. తాత్కాలిక సచివాలయంలోని ఐదు బ్లాకులకు సంబంధించి కీలకమైన ఆర్థిక, హోం, రెవెన్యూ శాఖలతో సహా సుమారు 48 శాఖలకు చెందిన 80 శాతం ఫైళ్లు శనివారం సాయంత్రానికి వచ్చేశాయి.
మిగిలినవి ఆదివారం మధ్యాహ్నంలోగా వస్తాయని చెప్పారు. సోమవారం ఉదయాన్నే సచివాలయ ఉద్యోగులు వెలగపూడిలో విధులకు హాజరయ్యేలా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే గుంటూరు, విజయవాడల్లో వివిధ శాఖల కమిషనరేట్లు, డైరెక్టరేట్లు ఏర్పాటు చేశారు.
తాత్కాలిక సచివాలయంలో అధికారుల చాంబర్లు, మంత్రుల పేషీలకు కూడా నేమ్ పేట్లు ఏర్పాటు చేశారు. సచివాలయంలో పాలన ప్రారంభం సందర్భంగా సభా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.