మొత్తం ఒకేసారి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకే దశలో నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా ఆదివారం తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో తొలి దశలోనే ఎన్నికలు జరగనున్నాయి.
మోగిన నగారా: లోకసభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన, ఏపీ-తెలంగాణల్లో ఏప్రిల్ 11న ఎన్నికలు
ఏప్రిల్ 11న తెలుగు రాష్ట్రాల్లోని లోకసభ స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించనున్నారు. మే 23న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఏపీలో 25 లోకసభ, తెలంగాణలో 17 లోకసభ స్థానాలు ఉన్నాయి. సరిగ్గా నెల రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి.
ఇక, ఏపీలోని 25 లోకసభ స్థానాలతో పాటు 175 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 11నే ఎన్నికలు జరగనున్నాయి. 2014లో తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి, అసెంబ్లీ, లోకసభ ఎన్నికలు జరిగాయి. ఈసారి తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లింది. దీంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు తెలంగాణ లోకసభ, ఏపీ లోకసభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకే విడతలో జరగనున్నాయి.
ఏపీ, తెలంగాణ లోకసభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు 18వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 18వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ దాఖలుకు ఆఖరు తేదీ 25. 26వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. 28వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ. మే 23 ఎన్నికల ఫలితాలు ఉంటాయి.