టెట్ 2018 ఫలితాలు విడుదల చేసిన మంత్రి గంటా
అమరావతి: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) 2018 ఫలితాలను మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. ఏపీ టెట్ కు 4,14,120 మంది అభ్యర్థులు హాజరయ్యారు. టెట్ పేపర్ -1లో 57.88 శాతం అభ్యర్థులు, పేపర్ -2లో 37.26 శాతం మంది, పేపర్ -3లో 43.60 శాతం అభ్యర్థులు హాజరైనట్లు మంత్రి వెల్లడించారు.
మొత్తంగా ప్రతి సబ్జెక్ట్ లోనూ 90కంటే ఎక్కువ మార్కులు సాధించిన వారు 25శాతం మంది ఉన్నారన్నారు. అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం ఫలితాలను విడుదల చేశామని మంత్రి తెలిపారు. టెట్ ఫలితాలను సంబంధిత వైబ్ సైట్ (aptet.apcfss.in) లో పొందుపరిచారు.
ఈ నెల 4న ఏపీ పాఠశాల విద్యాశాఖ ప్రాథమిక కీని విడుదల చేసింది. టెట్ పేపర్-1పై అత్యధికంగా 9,867 అభ్యంతరాలు రాగా, 9,867, పేపర్-2పై 4,162, పేపర్-3పై అభ్యర్థుల నుంచి 1,858 అభ్యంతరాలు వచ్చిన విషయం తెలిసిందే. అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం సోమవారం సాయంత్రం ఫలితాలను విడుదల చేశారు.
విజయవాడలో టెట్ ఫలితాలను విడుదల చేసిన అనంతరం మంత్రి గంటా శ్రీనివాసరావు ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు శుభవార్త చెప్పారు. సుమారు 10 వేల ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి అనుమతిని కోరుతూ ఆర్థిక శాఖకు నివేదిక ఇచ్చినట్లు తెలిపారు. ఆర్థిక శాఖ నుంచి అనుమతి రాగానే ఈ వారంలోనే డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని ఆయన తెలిపారు.