ఏపీలో మూడు కాన్సెప్ట్ సిటీలు: సీఎం వైఎస్ జగన్, ఎక్కడెక్కడంటే..?
అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాస్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థకు బలమైన సమాచార సాంకేతిక వ్యవస్థను అందించాలని ఆదేశించారు.
అవినీతికి తావులేకుండా..
గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ సక్రమంగా పనిచేస్తే అవినీతి తగ్గుతుందని వ్యాఖ్యానించారు. రేషన్, పింఛను, ఆరోగ్యశ్రీ ఫీజు చెల్లింపు కార్డులన్నీ సచివాలయాలే ఇస్తాయని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. లబ్ధిదారులకు ఈ కార్డులన్నీ అందాలంటే దానికి సంబంధించిన వ్యవస్థ సక్రమంగా ఉండాలన్నారు.
మూడు కాన్సెప్ట్ సిటీలు
పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇచ్చేలా చూస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే సంస్థలకు ప్రోత్సాహక ధరలతో భూమి, నీరు, విద్యుత్ ఇస్తామని సీఎం తెలిపారు. ఇక విశాఖపట్నం, తిరుపతి, అనంతపురంలో కాన్సెప్ట్ సిటీల ఏర్పాటుపై ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం జగన్ సూచించారు. ఒక్కో సిటీ 10 చ.కి.మీ పరిధిలో ఏర్పాటు చేసేలా ప్లాన్ చేయాలని అధికారులను ఆదేశించారు.
రివర్స్ టెండరింగ్ పై సమీక్ష
ఏపీ రాష్ట్ర పట్టణ మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధి సంస్థ(టిడ్కో)పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఏపీ టిడ్కో పరిధిలో ఉన్న 65,969 ఫ్లాట్ల నిర్మాణంపై రివర్స్ టెండరింగ్ను ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రధాన టెండర్లు తెరిచిన మరుసటి రోజే రివర్స్ టెండర్ నిర్వహించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రధాన టెండర్లకు, రివర్స్ టెండర్కు మధ్య ఎక్కువ సమయం ఉండకూడదన్నారు.
ప్రజాదనం ఆదా.. పారదర్శకతే..
నవంబర్ 22న 14,368 ఇళ్ల నిర్మాణానికి టెండరింగ్కు వెళ్తున్నామని అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వివరించారు. దీనికి మరుసటిరోజే రివర్స్టెండరింగ్ను నిర్వహించాలని సీఎం ఆదేశించారు. మిగిలిన ఇళ్లకూ కూడా త్వరలోనే టెండర్లను పిలుస్తామని అధికారులు వివరించారు. గతంలో నిర్దేశించిన నిర్మాణ ప్రమాణాలను అలాగే ఉంచి రివర్స్ టెండరింగ్ పిలవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.