అమూల్తో ఏపీ సర్కారు ఒప్పందం: అధికారులకు జగన్ ఆదేశాలు
అమరావతి: పాల ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం ప్రముఖ సంస్థ అమూల్తో వ్యూహాత్మక భాగస్వామ్యం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చక్కెర కర్మాగారాలు, పారి పరిశ్రమపై సమీక్షించారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, కన్నబాబు, గౌతమ్ రెడ్డి, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అమూల్ భాగస్వామ్యంపై విధివిధానాలు ఖరారు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత ఒప్పందం కుదుర్చుకోవాలని సూచించారు. దీనిపై అధికారులు స్పందిస్తూ.. జులై 15లోగా అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంటామని సీఎంకు తెలిపారు.
సహకార రంగం బలోపేతం, రైతులకు మంచి ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఇకపై పాడి రైతులను దోచుకునే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదని స్పష్టం చేశారు. పశువులకు వైద్య, సంరక్షణ, సాంకేతికత, పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
సహకార చక్కెర కర్మాగారాల పరిస్థితిని సీఎంకు అధికారులు ఈ సందర్భంగా వివరించారు. పునరుద్ధరించాల్సిన కర్మాగారాల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. మంత్రులు, అధికారులు కలిసి ప్రతిపాదనలు తయారు చేయాలని సీఎం సూచించారు. ప్రణాళికపై ప్రతిపాదనలు వచ్చాక చర్చించి నిర్ణయం తీసుకుందామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు.