ఈజ్ ఆఫ్ డూయింగ్: ఏపీ టాప్, రెండో స్థానంలో తెలంగాణ, టాప్-5రాష్ట్రాలివే
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్(సులభతర వాణిజ్య) ర్యాంకులు తెలుగు రాష్ట్రాలు మొదటి రెండు స్థానాల్లో చోటు దక్కించుకున్నాయి. వాణిజ్య సంస్కకరణలు, కార్యాచరణ ప్రణాళిక ఆధారంగా రూపొందించిన ఈ ర్యాంకుల జాబితాను ప్రపంచ బ్యాంక్, డీఐపీపీ కార్యర్శి రమేష్ అభిషేక్ మంగళవారం ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ మంత్రి కేటీఆర్ అభినందనలు, '0.09తో టాప్ ప్లేస్ మిస్'
ఈ జాబితాలో రాష్ట్రాలను నాలుగు విభాగాలుగా గుర్తించారు. 95శాతం పైబడి సంస్కరణల్ని అమలు చేసిన రాష్ట్రాలను 'టాప్ అచీవర్స్', 90 నుంచి 95శాతం మేర సంస్కరణలు అమలు చేసిన రాష్ట్రాలను 'అచీవర్స్'(విజేతలు)గా, 80 నుంచి 90శాతం సంస్కరణలు అమలు చేసిన రాష్ట్రాలను 'ఫాస్ట్ మూవర్స్'గా, 80శాతంలోపు సంస్కరణలు చేసిన రాష్ట్రాలను 'అస్పైరర్స్'గా నిర్ణయించారు.
ఈ ఏడాది ప్రకటించిన టాప్ అచీవర్స్ జాబితాలో ఆంధ్రప్రదేశ్ తొలిస్థానంలో నిలవగా.. రెండో స్థానంలో తెలంగాణ, మూడోస్థానంలో హర్యానా, నాలుగో స్థానంలో జార్ఖండ్, ఐదో స్థానంలో గుజరాత్ రాష్ట్రాలు నిలిచాయి. అయితే, టాప్ అచీవర్స్ జాబితాలో 9రాష్ట్రాలు, అచీవర్స్ జాబితాలో ఆరు, ఫాస్ట్ మూవర్స్ జాబితాలో మూడు, అస్పైరర్స్ జాబితాలో 18రాష్ట్రాలు నిలిచాయి. సంస్కరణల అమలు స్కోర్లో ఎక్కువ పురోగతి సాధించిన రాష్ట్రాల జాబితాలో అసోం, తమిళనాడులకు చోటు లభించింది.
ఆస్తుల రిజిస్ట్రేషన్లో ఛత్తీస్గఢ్, నిర్మాణరంగ అనుమతుల్లో రాజస్థాన్, కార్మిక చట్టాల్లో పశ్చిమబెంగాల్, పర్యావరణ రిజిస్ట్రేషన్లలో కర్ణాటక, భూమి లభ్యతలో ఉత్తరాఖండ్, పన్నుల చెల్లింపులో ఒడిశా, పర్యవేక్షణ అమలులో మధ్యప్రదేశ్, ఐటీ పారదర్శకతలో మహారాష్ట్ర వందశాతం స్కోర్ సాధించాయి. 34శాతంతో ఢిల్లీ అత్యంత అల్ప ర్యాంకులో ఉండటం గమనార్హం.