Vijayawada: నెరవేరబోతున్న కల: ప్రారంభానికి సిద్ధం: కేంద్రమంత్రి చేతుల మీదుగా..!
విజయవాడ: విజయవాడ వాసుల కల నెరవేరబోతోంది. కొత్త సంవత్సరం కానుకగా ముందుకు రాబోతోంది. కేంద్రమంత్రి చేతుల మీదుగా ప్రారంభానికి రెడీ అయింది. అదే- బెంజి సర్కిల్ ఫ్లైఓవర్. జనవరి 1వ తేదీన ఈ ఫ్లైఓవర్ ను ప్రారంభించడానికిక జిల్లా పాలనా యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి రవాణా, రోడ్లు, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ముఖ్యఅతిథిగా ఆహ్వానించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
విజయవాడ బెంజిసర్కిల్ మీదుగా నిర్మిస్తున్న ఫ్లైఓవర్ నిర్మాణం చిన్న, చిన్న పనులు మినహా దాదాపు పూర్తయింది. ఈ రెండు రోజుల్లోనే వాటిని కూడా పూర్తి చేసుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అధికారులను ఆదేశించారు. కొత్త సంవత్సరంలో వంతెన ప్రారంభించడం దాదాపు ఖాయమైనందున.. దానికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేయాలని సూచించారు. బెంజి సర్కిల్ ఫ్లైఓవర్ ను ఎప్పుడు అందుబాటులోకి తీసుకుని రావాలనే అంశంపై జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశంలో కూడా చర్చకు వచ్చిన విషయం తెలిసిందే.
విజయవాడలో అత్యంత రద్దీతో కూడుకుని ఉన్న ప్రదేశమైనందున.. ఈ ఫ్లైఓవర్ ను ప్రారంభించడంలో ఎలాంటి జాప్యాన్ని చేయకూడదని జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశంలో మంత్రులు సూచించారు. వారి ఆదేశాల మేరకు ఫ్లైఓవర్ ను వాహనదారులకు అందుబాటులోకి తీసుకుని రావడానికి శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అండర్ పాత్, విద్యుదీకరణ పనులు చాలామటుకు పూర్తయ్యాయి.
బెంజిసర్కిల్ లో గంటకు దాదాపు 200 వాహనాలు క్రాస్ అవుతుంటాయి. 12 మీటర్ల వెడల్పుతో, మూడు లేన్లుగా ఈ ఫ్లైఓవర్ రూపుదిద్దుకుంది. రెండు వైపుల నుంచి వాహనాల రాకపోకలకు అనుమతి ఇవ్వాలా? వద్దా? అనే విషయంపై అధికారులు ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని కూడా తీసుకోలేకపోతున్నారు. వన్ వే గా దీన్ని తొలుత ప్రారంభించాల్సి ఉంటుందని, అనంతరం వాహన రద్దీ, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని రెండు వైపుల నుంచి వాహనాల రాకపోకలకు అనుమతి ఇవ్వాలనే అభిప్రాయం అధికారుల్లో వ్యక్తమౌతోంది.