Vanijya Utsav 2021: విమర్శలకు వైఎస్ జగన్ మార్క్ చెక్: పీఎం మోడీ బొమ్మ
అమరావతి: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి గత ఏడాది నెలల తరబడి రాష్ట్రం లాక్డౌన్లోకి వెళ్లింది. ఈ ఏడాది సెకెండ్ వేవ్ సమయంలోనూ ఇదే తరహా పరిస్థితులను ఎదుర్కొంది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు లాక్డౌన్లోకి వెళ్లినప్పటికీ- ఏపీలో మాత్రం కఠిన ఆంక్షలు కొనసాగాయే తప్ప సంపూర్ణ లాక్డౌన్ను విధించలేదు జగన్ సర్కార్. అయిప్పటికీ- లాక్డౌన్, లాక్డౌన్ తరహా పరిస్థితుల వల్ల పెద్ద ఎత్తున ఆదాయాన్ని కోల్పోయింది.
ఏపీ హైకోర్టుకు కొత్త చీఫ్ జస్టిస్, ఇద్దరు న్యాయమూర్తులు: తెలంగాణ జడ్జి బదిలీ: కంప్లీట్ లిస్ట్ ఇదే
రెండు రోజుల వాణిజ్య ఉత్సవ్..
ఈ పరిస్థితుల్లో రాష్ట్రానికి వచ్చే రోజువారీ ఆదాయాన్ని గణనీయంగా పెంచుకోవడానికి, పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడానికి జగన్ సర్కార్ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా- వాణిజ్య ఉత్సవ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. విజయవాడలో ఏర్పాటైన ఈ సదస్సు రెండు రోజుల పాటు కొనసాగుతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఉదయం ప్రారంభించారు. వాణిజ్యం-పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, పలువురు పారిశ్రామికవేత్తలు దీనికి హాజరయ్యారు.
భారీగా ఎగుమతి లక్ష్యాలు..
ఈ సందర్భంగా వైఎస్ జగన్ ప్రసంగించారు. పారిశ్రామిక విధానం గురించి ప్రస్తావించారు. పారిశ్రామికవేత్తలకు పూర్తి సహకారాన్ని అందిస్తామని భరోసా ఇచ్చారు. ఏపీ ఎగుమతుల రోడ్ మ్యాప్ బ్రోచర్ను విడుదల చేశారు. ఎగుమతులకు సంబధించి ప్రత్యేకంగా రూపొందించిన ఈ-పోర్టల్ను ఆవిష్కరించారు. ఎగుమతులు రెండేళ్లలో 19.43 శాతం వృద్ధి చెందామని పేర్కొన్నారు. 2020-2021లో 1.23 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన ఎగుమతులు నమోదయ్యాయని అన్నారు.
ఇండస్ట్రీయల్ కారిడార్స్..
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ మొదటి స్థానంలో ఉందని పేర్కొన్నారు. 2020-2021 ఆర్థిక సంవత్సరంలో ఎగుమతుల్లో ఏపీ నాలుగో స్థానంలో ఉందని వైఎస్ జగన్ చెప్పారు. ఈ రెండు సంవత్సరాల కాలంలో 20,390 కోట్ల రూపాయలతో 10 మెగా ప్రాజెక్టులను ఏర్పాటు చేశామని తెలిపారు. దీని ద్వారా 55 వేల మందికి ఉపాధి కల్పించినట్లు ఆయన వివరించారు. విశాఖ- చెన్నై, చెన్నై- బెంగళూరు, హైదారాబాద్- బెంగళూరు ఇండస్ట్రీయల్ కారిడార్లను అమలు చేస్తోన్న ఏకైక రాష్ట్రం ఏపీనే అని తెలిపారు.
కొప్పర్తిలో క్లస్టర్..
కడప జిల్లా కొప్పర్తిలో 3,155 ఎకరాల్లో వైఎస్ఆర్ జగనన్న మెగా ఇండస్ట్రీయల్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు 730 కోట్ల రూపాయల పెట్టుబడితో 801 ఎకరాల్లో వైఎస్సార్ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్షరింగ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో , 13 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో మూడు గ్రీన్ఫీల్డ్ పోర్టులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 2023-2024 కల్లా భావనపాడు, మచిలీపట్నం, రాయామపట్నం పోర్టులు అందుబాటులోకి వచ్చేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకున్నామని అన్నారు.
80 వేల మందికి ఉపాధి..
మూడు వేల మిలియన్ టన్నుల ఉత్పాదక సామర్థ్యంతో 500 కోట్ల రూపాయలతో కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. గెయిల్తో కలిసి గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఏర్పాటు చేశామని అన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడానికి 25 ప్రపంచస్థాయి కళాళాలలు ఏర్పాటు చేశామని వైఎస్ జగన్ వివరించారు. దేశ ఎగుమతుల్లో రాష్ట్రం 10 శాతం వాటాను సాధించడమే లక్ష్యమని అన్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రూ. 2,500 కోట్ల పెట్టుబడితో 80 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని సీఎం వైయస్ జగన్ తెలిపారు.
విమర్శలకు చెక్..
ఈ వాణిజ్య ఉత్సవ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫొటోను ప్రభుత్వం విస్తృతంగా వినియోగించింది. వేదిక వెనుక భాగంలో ప్రదర్శించిన భారీ బ్యానర్, డిజిటల్ స్క్రీన్లపై నరేంద్ర మోడీ ఫొటోను వినియోగించడం కనిపించింది. సాధారణంగా- ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోజరిగే ఇలాంటి కార్యక్రమాలకు ప్రధానమంత్రి ఫొటోలను ప్రదర్శించడం చాలా తక్కువ. దీనికి భిన్నంగా వైఎస్ జగన్ సర్కార్ వ్యవహరించింది. విమర్శకుల నోటికి తాళం వేసినట్టయిందనే అభిప్రాయాలు వ్యెక్తమౌతోన్నాయి.