పాములు బాబోయ్ పాములు...ఊళ్లనిండా వందల సర్పాలు:కేరళలో కాదు ఆంధ్రాలోనే!
విజయవాడ:అసలే వరద ముంపుతో కుదేలైన ఆ గ్రామాల ప్రజలను ఇప్పుడు పాములు బెంబేలెత్తిస్తున్నాయి. ఒక్కటి కాదు రెండు కాదు...పది కాదు...ఇరవై కాదు... వందల సంఖ్యలో పాములు ఊళ్లమీద కట్టలుకట్టలుగా వచ్చిపడుతున్నాయి.
అసలే వర్షాల ధాటికి నిండా మునిగిన ఈ జనాలను విషసర్పాల కాట్లు నిలువెల్లా వణికిస్తున్నాయి. పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో పాము కాట్లతో వందలమంది ఆస్పత్రులకు పరుగులు పెడుతున్న పరిస్థితి...అయితే ఎంత వరద నీరొచ్చినా ఇంతకుముందెన్నడూ ఈ స్థాయిలో పాములు ఊళ్లమీదకు రాలేదని చర్చించుకుంటున్న జనం ఏదో జరిగిపోతోందంటూ భీతిల్లిపోతున్నారు. ఎందుకిలా జరుగుతోందని మధనపడిపోతున్నారు?...వివరాల్లోకి వెళితే...
అక్కడ...పాముల భయం...
పశ్చిమ గోదావరి,కృష్ణా జిల్లాల్లో వరద ముంపు ప్రాంతాల ప్రజలను పాముల భయం బెంబేలెత్తిస్తోంది. భారీ వర్షాలు, వరదనీటి ప్రవాహాల కారణంగా పెద్దఎత్తున పాములు కొట్టుకు రావడమే కాదు పుట్టలు, బొరియలు, భూమి నెర్రెల నుంచి బయటకు వచ్చి ఊళ్లల్లోకి ప్రవేశిస్తున్నాయి. ఆ క్రమంలో అవి ప్రాణభయంతోటి కనబడినవారినల్లా కాటేస్తున్నాయి. అవును ఇప్పుడు అదే జరుగుతోంది...నిడదవోలులోని ఎర్రకాల్వ వద్ద గురువారం నాడు ఆరుగురిని పాములు కాటేయడంతో హుటాహుటిన వారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. మరోవైపు కృష్ణా,గుంటూరు జిల్లాలో పాముల కాటుకు గురైన వారి సంఖ్య 100 కు చేరువవుతోంది.
రక్షణ కోసం...కర్రలతో కాపలా
గ్రామాల్లో ఎటుచూసినా పాములే కనబడుతుండటంతో తమ వారి ప్రాణాలు కాపాడుకునేందుకు రైతన్నలు కర్రలు చేతబట్టి వంతుల వారీగా కాపలాలు కాస్తున్నారు. అదేమిటి పాములు కంటబడేటట్లు తిరుగుతాయా అనుకోవద్దు?...ఉంది ఒకటో అరా పాము కాదు కదా...ఏ ఊళ్లో చూసినా పదుల సంఖ్యలో పాములు తిరుగాడుతుండటంతో కనిపించినవాటిని కనిపించినట్లు హతమారుస్తున్నారు గ్రామస్థులు. కృష్ణాజిల్లా కోడూరు మండలం విశ్వనాథపల్లి గ్రామంలో పాముల దెబ్బకు రైతన్నలు కాపలా కాస్తున్న దృశ్యమిది.
వరద భీభత్సం...పాముల దాడి
ఇందుకు కారణం ఇటీవలికాలంలో ఎన్నడూ భారీ వర్షాలు...ఎడతెరిపిలేని వానలు లేకపోవడంతో వాగులు, వంకలు పొర్లిందే లేదు. అయితే ఇటీవలి భారీ వర్షాల తాకిడికి అన్ని వైపులా వరద నీరు దూసుకురావడంతో ఏళ్ల తరబడి ఆవాసాలుగా చేసుకున్న పుట్టలు, కలుగులు, బొరియలు మూసుకు పోవడంతో విష సర్పాలు ఒక్కసారిగా వెల్లువలా బయటపడ్డాయి. ఎలాగంటే నీటి ప్రవాహాల్లోనే ఆ పాములు పెద్ద సంఖ్యలో కొట్టుకుపోతూ కనిపిస్తున్నాయి. మరికొన్ని చెట్ల మీదకు, గట్ల మీదకు ఎగబాకుతున్నాయి. మరికొన్ని నేరుగా జనావాసాల్లోకి చొచ్చుకువస్తున్నాయి.
తమ్మిలేరు...తాచుపాములు,కట్ల పాములు
తమ్మిలేరు ఉధృతికి గడచిన నాలుగు రోజులుగా కొట్టుకొచ్చిన విష సర్పాల సంఖ్య వందల్లోనే ఉందంటున్నారు. ఇప్పటిదాకా మెట్ట ప్రాంతంలో ఆవాసాలు ఉంటున్న తాచులు, పొడపాములు ఒక్కసారిగా బయటపడగా...అసలు తామింతవరకూ చూడని భీకర పరిమాణంలో ఈ పాములు ఉండటంతో జనం వాటిని చూస్తేనే పైప్రాణాలు పైనే పోయే పరిస్థితి కనిపిస్తోంది. తాచుపాములైతే ఏకంగా తొమ్మిది,పది అడుగులు ఉంటున్నాయంటున్నారు. బుసలు కొడుతూ, పడగ విప్పుతూ, నీళ్ళల్లో కొట్టుకు పోతూ వాటిని చూస్తుంటే జనం ఆందోళన అంతాఇంతాకాదు. వాటిని తుచుకుంటేనే వణుకొస్తోందంటున్నారు ప్రత్యక్ష సాక్షులు. ఇక వీటికి మండ్రకప్పలు, తేళ్ళు, జర్రుల బాధ తోడవడంతో జనాల బాధ అంతాయింతాకాదు.
ఇంతకు...ముందెప్పుడూ చూడలేదు
‘సాధారణంగా ఈ మధ్యన పాములు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. వరదలొస్తే గాని తెలియలేదు. చీమలు పాకినట్టుగా పాములు వెళ్తున్నాయి. ఇంత సంఖ్యలో ఎప్పుడూ చూడలేదు. ఇవన్నీ ఏదొక మూలకు చేరి ప్రస్తుతానికి మకాం వేసినా, అందరూ జాగ్రత్తలు పాటించకపోతే నష్టమే' అని కోటేశ్వర దుర్గాపురంకు చెందిన రైతు చెప్పారు. ఏజెన్సీ ప్రాంతంలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరదలతో మొదటి రెండు రోజులు పాములు పెద్ద సంఖ్యలోనే కొట్టుకొచ్చాయని చెబుతున్నారు. అవనిగడ్డ, ఆ చుట్టు ప్రక్కల గ్రామాల్లో ఒక్క రోజులో 45 మంది పాము కాటుకు గురికాగా ఒకే ఊళ్లో 24 మందిని కరిచాయి. దీంతో సాక్షాత్తూ ముఖ్యమంత్రే ఆ పాముల బెడద విషయమై అధికారులను ఆదేశించడంతో పాటు రైతుల్ని అప్రమప్తం చేయాల్సిందిగా సూచించారంటే పరిస్థితి ెలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.