పాల ప్యాకెట్ల తరహాలో మద్యం?...ఎపిలో ఎక్సైజ్ శాఖ సరి కొత్త ప్రయోగం
అమరావతి: మద్యం అమ్మకాల ద్వారా మరింత ఆదాయం కోసం ఏపీ ఎక్సైజ్శాఖ వినూత్న మార్గాలు అన్వేషిస్తోంది. ఆ క్రమంలో మద్యం విక్రయాల్లో ఒక కొత్త నిర్ణయాన్నిఅమలు చేసేందుకు సంసిద్దమవుతోంది...ఇంతకీ అదేమిటంటే ఇప్పటి వరకు సీసాల్లోనే అమ్మకాలు జరుగుతున్నమద్యాన్ని పాలపాకెట్ల తరహాలో టెట్రా ప్యాకెట్లలో అమ్మాలనేదే ఆ న్యూ డెసిషన్. అందుకే ఈ విధానం గురించి అధ్యయనం చేసేందుకు ఎపి ప్రభుత్వం సోమవారం ఎక్సైజ్ అధికారుల బృందాన్ని పూణేకి పంపించింది.
మద్యం అమ్మకాల్లో అక్రమాల నివారణకే ఈ విధానాన్నిఅందుబాటులోకి తెస్తున్నామని ఎక్సైజ్ శాఖ పెద్దలు చెబుతున్నట్లు తెలిసింది.అయితే ఎపి ప్రభుత్వం ఈ నిర్ణయంపై మహిళా సంఘాలు మాత్రం మండిపడుతున్నాయి. ఇప్పటి వరకు బార్ షాపులకే పరిమితమైన మద్యం ఇప్పుడు ఇలా ప్యాకెట్ల రూపంలో బయటకు వస్తే ఇక తమ కుటుంబాలు రోడ్డున పడటం ఖాయమని వారంటున్నారు.
ఆ విధానంలో ఖర్చు తక్కువని, కల్తీలకు, అక్రమాలకు ఆస్కారం ఉండదని ప్రచారం జరుగుతుండటంతో...దీని పట్ల ఆకర్షితమైన ఎపి ప్రభుత్వం దీని గురించి అధ్యయనం చేసేందుకు సోమవారం ఎక్సైజ్ అధికారుల బృందాన్ని పూణేకి పంపించింది. అక్కడకి ఎందుకంటే...ఇప్పటికే పూణేలో ఓ మద్యం కంపెనీ మాజా ప్యాకెట్ల తరహాలో మద్యాన్ని టెట్రా ప్యాకెట్లలో తయారుచేస్తున్నారట.
మద్యంను బాటిళ్లలో సరఫరా చెయ్యడం వల్ల బాటిల్ కు, ప్యాకింగ్ కి చాలా ఖర్చు అవుతుందట...అదే టెట్రా ప్యాకెట్ ద్వారా విక్రయాలు జరపడం ప్రారంభిస్తే బోలెడంత ఖర్చు కలిసివస్తుందట...అయితే ఫూణే తరహా ప్యాకింగ్ కు కూడా కొంచెం ఎక్కువే ఖర్చు అవుతోందట. ఆ విధానంలో 180 ఎంఎల్ ప్యాకెట్ తయారీకి రూ. 2 ఖర్చవుతోంది. దీనివల్ల ఉత్పత్తిదారులకు లాభం తగ్గుతోందట. పైగా ఆ ప్యాకెట్లు రీసైకిలింగ్కు కూడా పనికి రావడం లేదట. అయితే తక్కువ ఖర్చుతో దీనికంటే మరింత మెరుగైన విధానం తీసుకురావాలని ఎక్సైజ్శాఖ భావిస్తునట్లు తెలిసింది. అందుకే 25 పైసల వ్యయంతో వచ్చే ప్యాకెట్లపై దృష్టిపెట్టారు. అవి కేవలం పాల ప్యాకెట్ల తరహాలో పలుచగా ఉంటాయని ఉత్పత్తిదారులు అంటున్నారు. ఆ తరహా ప్యాకెట్ల విధానాన్నే మన రాష్ట్రంలోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలిసింది.
ప్రస్తుతం మద్యం అమ్మకాల్లో కల్తీ, చీప్ లిక్కర్ ను ఖరీదైన మద్యంలో కలిపై డైల్యూషన్ పెద్ద సమస్యగా మారింది. దీనివల్ల వినియోగదారులు నష్టపోవడం ఒకటైతే, కొన్నిసార్లు ఇలాంటి డైల్యూషన్ కారణంగా ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుంది. అదే టెట్రా ప్యాకెట్ల పద్దతిలో దీనిని నివారించగలుగుతుందని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. టెట్రా ప్యాకెట్కు ఒకసారి రంధ్రం చేస్తే ఇక పూడ్చడం కుదరదని, దాంతో ఆ ప్యాకెట్లలో నీరు, ఇతర లిక్కర్ కలపడం అసాధ్యమని అంటున్నట్లు తెలిసింది. సీసాల కంటే టెట్రా ప్యాకెట్లు లభిస్తే తక్కువ ధరకే లభిస్తే అందరూ వాటి కొనుగోలుకే మొగ్గుతారని ఎక్సైజ్ శాఖ ముఖ్యులు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం.