Nelloreలో AP Tourism DGM భాస్కర్ ఘాతుకం: ఆఫీస్లోనే మహిళా ఉద్యోగిపై జులుం
నెల్లూరు: నెల్లూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ జిల్లా స్థాయి కార్యాలయంలో ఓ మహిళా ఉద్యోగినిపై దాడికి పాల్పడ్డాడో ఉన్నతాధికారి. తోటి ఉద్యోగులందరూ చూస్తుండగానే ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చి పడేశాడు. చేతికి అందిన వస్తువులతో చితగ్గొట్టాడు. కార్యాలయంలో సీసీటీవీ కెమెరా ఉందనే విషయం తెలిసి కూడా ఆ ఉద్యోగినిపై ఈ ఘాతుకానికి పాల్పడ్డాడతను. ఈ ఘటనపై పోలీసులు స్పందించారు. ఆ అధికారిపై కేసు నమోదు చేశారు.
ఆ అధికారి ఆ స్థాయిలో ఆమెను చితగ్గొట్టడానికి కారణం- ముఖానికి మాస్క్ వేసుకోవాలని సూచించడమే. ఈ నెల 27వ తేదీన చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు బహిర్గతం అయ్యాయి. సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఉద్యోగినిపై దాడికి పాల్పడిన అధికారిపై కఠిన చర్యలను తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దీనిపై రాష్ట్ర మహిళా కమిషన్ వెంటనే స్పందించాలని నినదిస్తున్నారు.
ఆ అధికారి పేరు భాస్కర్. నెల్లూరు జిల్లా పర్యాటకాభివృద్ధి సంస్థలో డిప్యూటీ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరి చేశాయి. అయినప్పటికీ.. ఈ నెల 27వ తేదీన భాస్కర్. మాస్క్ ధరించకుండా విధులకు హాజరయ్యాడు. తన కింది స్థాయి ఉద్యోగులతో సమావేశం అయ్యాడు. దీన్ని చూసిన ఉద్యోగిని ఒకరు.. మాస్క్ ధరించాలని సూచించారు.
#WATCH An employee of a hotel in Nellore under Andhra Pradesh Tourism Department beat up a woman colleague on 27th June following a verbal spat. Case registered against the man under relevant sections. pic.twitter.com/6u9HjlXvOR
— ANI (@ANI) June 30, 2020
Recommended Video
ఆమె అలా చెప్పడమే తప్పయింది. తనను మాస్క్ వేసుకోవాలని సూచించినందుకు ఆమెపై దాడికి పాల్పడ్డాడు. నాకు వైరస్ సోకిందనుకుంటున్నావా? నాకే ఎదురు చెబుతావా? అంటూ ఆ ఉద్యోగినిని తీవ్రంగా కొట్టాడు. జుట్టు పట్టుకుని ఈడ్చేశాడు. చేతికి అందిన వస్తువులను ఇష్టానుసారంగా కొట్టాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. అనంతరం బాధిత ఉద్యోగిని నెల్లూరు ఫోర్త్టౌన్ పోలీస్ స్టేషన్లో భాస్కర్పై ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.