వాజ్పేయి జయంతి నాడు ఇళ్ల పట్టాల పంపిణీ: వైఎస్ జగన్ వ్యూహమేంటీ? డబుల్ చెక్?
అమరావతి: రాష్ట్రంలో సుదీర్ఘకాలం పాటు వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోన్న పేదలకుఇళ్ల పట్టాల పంపిణీ పథకం కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం మరో కొత్త ముహూర్తాన్ని నిర్ణయించింది. డిసెంబర్ 25వ తేదీన ఈ పథకాన్ని ప్రారంభిస్తామని ప్రకటించింది. దీనికి అవసరమైన సన్నాహాలను త్వరలోనే చేపట్టబోతోంది. చట్టపరమైన ఇబ్బందులు.. హైకోర్టు ఆదేశాలు.. ఇతరత్రా కారణాల వల్ల నాలుగైదు సార్లు వాయిదా పడిన ఈ పథకాన్ని ప్రారంభించడానికి నిర్ణయించిన తేదీ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమౌతోంది. వివాదాస్పదమౌతోంది.
Recommended Video
10 నెలలుగా వాయిదాల పర్వం..
అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తామంటూ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీని అమలు చేయడంలో వైఎస్ జగన్ ఇబ్బందులను ఎదుర్కొన్నారు. వాటి ఫలితంగా 10 నెలలుగా ఈ పథకం తేదీలు మారుతూ వస్తోందే తప్ప.. కార్యాచరణలోకి రాలేదు. తొలిసారిగా ఈ ఏడాది మార్చి 25వ తేదీన ఈ పథకాన్ని ప్రారంభించాల్సి ఉంది. అప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాల్సి రావడం వల్ల ప్రభుత్వం వాయిదా వేసింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14వ తేదీన పంపిణీ చేయాలని భావించింది. అప్పటికే కరోనా వైరస్ వ్యాప్తి చెందడం వల్ల మరోసారి వాయిదా వేయడానికే మొగ్గు చూపింది.
వైఎస్సార్ జయంతి నాడూ కుదర్లేదు..
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజైన జులై 8వ తేదీన ఇళ్ల పట్టాల పంపిణీ పథకాన్ని పట్టాలెక్కించాలని భావించినా సాధ్య పడలేదు. చట్టపరమైన ఇబ్బందులు తలెత్తడంతో మరోసారి వాయిదా వేయాల్సి వచ్చింది. ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం నాడు, మహాత్మాగాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2న ముహూర్తాన్ని ఖాయం చేసినప్పటికీ.. వాస్తవ రూపాన్ని సంతరించుకోలేకపోయిందా పథకం. ఈ సారి తాజాగా డిసెంబర్ 25వ తేదీన ఇళ్ల పట్టాల పంపిణీ పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకుంది.
వాజ్పేయి జయంతిని ఎంచుకోవడం వెనుక..
ఇళ్ల పట్టాల పంపిణీ కోసం భారతరత్న, మాజీ ప్రధానమంత్రి, దివంగత అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని ఎంచుకోవడం వెనుక వైఎస్ జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేసినట్లు తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీ అగ్రనేత జయంతి నాడు ఈ ప్రతిష్ఠాత్మక పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించడం ఆ పార్టీ అగ్రనేతల మెప్పు పొందడానికేనా? అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. కేంద్రంలో అధికారంలోో ఎన్న ఎన్డీఏ కూటమిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరుతుందంటూ కొద్దిరోజుల కిందట చెలరేగిన ఊహాగానాలకు మరింత బలాన్ని ఇచ్చినట్టయిందనే అభిప్రాయాలు ఉన్నాయి.
ఆ తరహా విమర్శలకు చెక్..
ఇళ్ల పట్టాల పంపిణీ పథకాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. 30 లక్షల మందికి పైగా అర్హులైన పేదలకు సొంత ఇంటిని నిర్మించి ఇవ్వడానికి ఉద్దేశించిన ఈ పథకాన్ని ప్రారంభించడానికి బీజేపీ మలితరం గాడ్ఫాదర్గా భావించే వాజ్పేయి జయంతిని ఎంచుకోవడం ఆ పార్టీ క్యాడర్ను కూడా ఆకర్షించినట్టవుతుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలకు వైఎస్ జగన్ తన పేరును, తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును పెడుతున్నారంటూ బీజేపీ క్యాడర్ చేస్తోన్న విమర్శలకు చెక్ పెట్టినట్టవుతుందని అంటున్నారు.
న్యాయపరమైన ఇబ్బందులనూ
ఈ పథకాన్ని ప్రారంభించడాన్ని అడ్డుకోవడానికి తెలుగుదేశం పార్టీ తనకు అందుబాటులో ఉన్న అవకాశాలను విస్తృతంగా వినియోగించుకుంటూ వచ్చిందనేది వైసీపీ నేతలు బాహటంగా విమర్శిస్తున్నారు. న్యాయపరమైన అడ్డంకులను కూడా టీడీపీ సృష్టిస్తోందనే వాదనను వారు వినిపిస్తున్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ పథకాన్ని ప్రారంభించడానికి వాజ్పేయి జయంతిని ఎంచుకోవడం వల్ల అటు టీడీపీ చేస్తోన్న ప్రయత్నాలకూ అడ్డుకట్ట పడే అవకాశం ఉందని అంటున్నారు వైసీపీ నేతలు. ఆ రోజున తలపెట్టిన కార్యక్రమాన్ని అడ్డుకోవడం ద్వారా బీజేపీ పెద్దల ఆగ్రహానికి గురవుతామనే కారణంతో టీడీపీ.. అడ్డుకునే ప్రయత్నం చేయకపోవచ్చని అంచనా వేస్తున్నారు.
వ్యూహాత్మక అడుగులు..
ఫలితంగా- అటు బీజేపీ అగ్ర నేతల మెప్పును పొందడంతో పాటు టీడీపీ చర్యలను కూడా అడ్డుకున్నట్టవుతుందని వైఎస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం లేబుల్ను అంటిస్తోందనే విమర్శలకు కూడా పుల్స్టాప్ పడినట్టవుతుందని వైసీపీ నేతల వాదన. కాగా- డిసెంబరు 25వ తేదీన డీ-ఫామ్తో పాటు ఇంటి స్థలం పట్టాలను ఇస్తామని వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రకటించింది. కోర్టు స్టే ఉన్నచోట్ల మినహా, మిగిలిన ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పేర్కొంది. అదే రోజున 15 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని కూడా మొదలు పెట్టబోతోంది. ఈ పథకం ద్వారా మొత్తం 30,68,821 మంది పేదలకు లబ్ది కలుగుతుంది.