సీ ఓటర్ సర్వే: అత్యంత ప్రజాదరణ గల ముఖ్యమంత్రుల జాబితా ఇదే: జగన్ ఏ స్థానంలో ఉన్నారంటే?
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఈ 20 నెలల కాలంలో నిర్వహించిన కొన్ని జాతీయసర్వేల్లో ఆయన తొలి అయిదు స్థానాల్లో చోటు దక్కించుకుంటూ వస్తున్నారు. ఈ సారి అది మరింత మెరుగుపడింది. టాప్-3లో స్థానం లభించింది. జాతీయ స్థాయి న్యూస్ ఛానల్ ఏబీపీ న్యూస్-సీ ఓటర్ సంయుక్తంగా నిర్వహించిన సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది. దేశంలో అత్యంత ప్రజాదరణ గల ముఖ్యమంత్రుల జాబితాను విడుదల చేసింది.
మూడో స్థానంలో వైఎస్ జగన్..
ఏబీపీ న్యూస్-సీ ఓటర్ దేశ్ కా మూడ్ పేరుతో ఈ సర్వేను చేపట్టింది. ప్రభుత్వం పట్ల ప్రజల్లో నెలకొన్న అభిప్రాయాలను సేకరించింది. దీనికి పనితీరు, ఎన్నికల హామీలు, మేనిఫెస్టోలో పొందుపరిచిన వాగ్దానాలను అమలు చేయడం, స్మార్ట్ గవర్నెన్స్, ఇ-గవర్నెన్స్.. వంటి కీలక అంశాలను ప్రాతిపదికగా తీసుకుంది. ముఖ్యమంత్రి వ్యవహార శైలినీ ఇందులో చేర్చింది. ప్రజల నుంచి వచ్చే సంతృప్తీకరణ (శాచ్యురేషన్ పాయింట్)ను ఆధారంగా చేసుకుంది. 543 లోక్సభ స్థానాల్లో 30 వేల మంది ఓటర్ల అభిప్రాయాలను సేకరించింది. 12 వారాల పాటు సర్వే నిర్వహించింది. ప్రభుత్వ పాలనకు సంబంధించిన ప్రశ్నాపత్రాన్ని ఓటర్లకు ఇవ్వడం ద్వారా వారి అభిప్రాయాలను స్వీకరించింది.
సంక్షేమంపైనే ఫోకస్..
రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో ఏర్పాటైన ప్రభుత్వానికి సారథ్యాన్ని వహిస్తోన్న వైఎస్ జగన్.. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి అధిక ప్రాధాన్యతను ఇస్తున్నట్లు సీ ఓటర్ సర్వే పేర్కొంది. ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు చాలావరకు లబ్దిదారులకు అందుతున్నాయనే విషయం తమ సర్వేలో తేలిందని స్పష్టం చేసింది. మెజారిటీ ప్రజలు ప్రభుత్వ పనితీరు పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని తెలిపింది. పాలన వేగంగా కొనసాతోందని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడినట్లు పేర్కొంది.
తొలి స్థానంలో నవీన్ పట్నాయక్..
ఈ జాబితాలో తొలి స్థానంలో బిజూ జనతాదళ్ చీఫ్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నిలిచారు. రాష్ట్ర జనాభాలో 60 శాతానికి పైగా ప్రజలు ఆయన పరిపాలనను ఇష్టపడుతున్నారని సర్వే తెలిపింది. రెండో స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిలిచారు. మౌలిక సదుపాయాల కల్పన, ఇ-గవర్నెన్స్ వంటి అంశాల్లో ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు సత్వర నిర్ణయాలను తీసుకోగలుుతున్నారని అంచనా వేసింది.
బీజేపీ ముఖ్యమంత్రుల స్థానం ఏంటీ?
ఈ జాబితాలో తొలి ఏడుమంది వరకూ భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు చోటు దక్కలేదు. నాలుగు, అయిదు స్థానాల్లో కేరళ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు పినరయి విజయన్, ఉద్ధవ్ థాకరే ఉన్నారు. వారి తరువాత కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఛత్తీస్గఢ్ ఆరో స్థానంలో నిలిచింది. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ ఆరో స్థానాన్ని ఆక్రమించారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఏడో స్థానంలో ఉన్నారు. అక్కడి నుంచి చివరి మూడు స్థానాలో బీజేపీ ముఖ్యమంత్రులకు దక్కాయి. ఎనిమిదో స్థానంలో శివరాజ్ సింగ్ చౌహాన్ (మధ్యప్రదేశ్), ప్రమోద్ సావంత్ (గోవా), విజయ్ రుపాణీ (గుజరాత్) నిలిచారు.