బాబు ఏజెంట్లతో జాగ్రత్త: దాసరి కలకలం, రోశయ్యతో ముద్రగడ(పిక్చర్స్)
హైదరాబాద్: కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం బుధవారం మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్యను కలిశారు. తాను మర్యాదపూర్వకంగానే ఆయనను కలిసినట్లు ముద్రగడ స్పష్టం చేశారు. అంతేగాక, కాపు ఉద్యమానికి రోశయ్య మద్దతు కోరినట్లు ఆయన తెలిపారు. కాగా, కాపు రిజర్వేషన్ల ఉద్యమం, భవిష్యత్ కార్యాచరణపై కాపు నేతలతో ముద్రగడ మంగళవారం సమావేశం నిర్వహించారు.
కాపు రిజర్వేషన్లు
కాపులను బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ కాపునాడు నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. ఆ మేరకు కాపుపెద్దల నుంచి మద్దతు, ఆమోదముద్ర లభించింది. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం నియోజకవర్గం నుంచి ముద్రగడ పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయించారు.
వాడివేడిగా సమావేశం
మంగళవారం హైదరాబాద్లోని హోటల్ దస్పల్లాలో కాపునాడు జాక్ కీలకభేటీ వాడి వేడిగా జరిగింది. ఈనెలాఖరులోగానీ వచ్చే నెల మొదటి వారం నుంచి గానీ ముద్రగడ పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఇదే విషయాన్ని సమావేశం ముగిసిన అనంతరం బొత్స సత్యనారాయణతో కలసి దాసరి నారాయణరావు, ముద్రగడ విలేఖరులకు వివరించారు.
ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు..
కాపువర్గానికి చెందిన ఐఏఎస్, ఐపిఎస్, ఇతర ఉన్నతాధికారులతో ఒక సలహా మండలి ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఒక సెక్రటేరియేట్ను, అధికార ప్రతినిధులను నియమిస్తారు. ప్రతి జిల్లాకు 30 మందితో జాక్ కమిటీలను ఏర్పాటు చేస్తారు. తొలుత.. రాజమండ్రిలో ఇటీవల ముద్రగడ నిర్వహించిన జిల్లా జాక్ నేతల భేటీలో వ్యక్తమయిన అభిప్రాయాలను, ముద్రగడ కాపునాడు జాక్లో వెల్లడించారు. అందులో భిక్షాటన చేయాలన్న జిల్లా నేతల సూచనలను కాపు పెద్దలు తప్పుపట్టారు. తమకు భిక్ష పెట్టాల్సిన అవసరం లేదని, పోరాడి సాధించుకోవాలని స్పష్టం చేశారు.
వినూత్నంగా..
దశాబ్దాల క్రితమే కాపులుగా ఉన్న తమను నీలం సంజీవరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు, అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం(నవంబర్ 1) రోజున బీసీ హోదా నుంచి తొలగించినందున, ఇకపై ఆ రోజును బ్లాక్డేగా పరిగణించాలని నిర్ణయించారు. కాపులను బీసీల్లో చేర్చాలని కోరుతూ, అన్ని పార్టీల నుంచి మంజునాధ కమిషన్కు లేఖ ఇప్పించేలా ఒత్తిడి చేయాలని నిర్ణయించారు. జేఏసీలో ఇకపై అన్ని పార్టీలకు ప్రాతినిధ్యం కల్పించనున్నారు. ప్రతి 15రోజులకోసారి వినూత్న నిరసనలు చేపట్టనున్నారు.
దాసరి వ్యాఖ్యల కలకలం
ఈ సందర్భంగా దాసరి నారాయణరావు చేసిన వ్యాఖ్యలు సమావేశంలో చర్చనీయాంశమయ్యాయి. ‘మనమంతా ముద్రగడ వెనుక ఉన్నామన్న సంకేతాలివ్వాలి. మనలో కూడా కొందరు బాబుకు ఏజెంట్లు ఉన్నారు. వాళ్లెవరో నాకు తెలుసు. అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉంటూనే కార్యాచరణ రూపొందించుకోవాలి. బాబు ఒత్తిడి తట్టుకునే రకం కాదు. అందుకే విభజించి పాలిస్తుంటారు. మనం కూడా ఒత్తిడి చేస్తేనే దారికొస్తాడు. మన ఉద్యమానికి బీసీ, ఎస్సీల సహకారం కూడా తీసుకోవాలి' అని వ్యాఖ్యానించినట్లు తెలిసింది.