ఏపీలో లోకల్ వార్ వన్ సైడే.. చేతులెత్తేసిన టీడీపీ, కనిపించని జనసేన, బీజేపీ ..!
ఏపీలో స్ధానిక ఎన్నికల పోరు సైలెంట్ గా ఏకపక్షంగా మారిపోతోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో టీడీపీ నుంచి వస్తున్న వలసలను ఆహ్వానిస్తున్న వైసీపీ... జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను దాదాపు ఏకగ్రీవంగా మార్చేసింది. విపక్షాలు నామినేషన్లు వేసిన మిగిలిన స్ధానాల్లోనూ ఎన్నికలు ఏకపక్షంగా మారే పరిస్ధితులే ఉన్నాయి. ఇదే పరిస్ధితి కొనసాగితే పంచాయతీ, పురపాలక ఎన్నికల్లో వైసీపీ మరోసారి గతేడాది అసెంబ్లీ ఎన్నికల ఫీట్ రిపీట్ చేసేలా కనిపిస్తోంది.
ముగిసిన జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లు
ఏపీ వ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల పర్వం నిన్నటితో ముగిసింది. ఇందులో 652 జడ్పీటీసీ, 9696 ఎంపీటీసీ స్ధానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే ఇందులో మెజారిటీ స్ధానాల్లో వైసీపీ అభ్యర్ధులు లేదా ఇండిపెండెట్లు మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. మరికొన్ని స్ధానాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్ధులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. ఎంపీటీసీ స్ధానాల్లో దాదాపు 50 వేలకు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి.
కొన్ని జిల్లాల్లో టీడీపీ ప్రభావం..
ఏపీలో గత కొన్ని నెలలుగా వైసీపీ ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం చేస్తున్న టీడీపీ స్ధానిక ఎన్నికలకు వచ్చేసరికి చేతులెత్తేసినట్లే కనిపిస్తోంది. అధికార వైసీపీతో పోలిస్తే పలు జిల్లాల్లో టీడీపీ అభ్యర్ధులు నామినేషన్లు వేసే విషయంలో వెనుకబడినట్లు తెలుస్తోంది. ప్రతీ జిల్లాలోనూ వైసీపీతో పోలిస్తే విపక్ష టీడీపీ నామినేషన్లు తక్కువగానే దాఖలయ్యాయి. అన్ని జిల్లాల్లో కలిపి వైసీపీ 23 వేలకు పైగా ఎంపీటీసీ స్ధానాల్లో నామినేషన్లు దాఖలు చేయగా.. టీడీపీ కేవలం 18 వేల స్ధానాల్లో మాత్రమే నామినేషన్ వేయగలిగింది. అంటే దాదాపు 5 వేల స్ధానాల్లో వైసీపీ లీడ్ లో ఉందన్నమాట. ఆయా స్ధానాల్లో ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి.
స్ధానిక పోరులో కనిపించని జనసేన..
గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ, టీడీపీతో పోరాటం చేసి ఒక స్ధానం మాత్రమే గెల్చుకున్న జనసేన పార్టీ ఈసారి స్ధానిక పోరులో పూర్తిగా చేతులెత్తేసింది. మెజారిటీ జిల్లాల్లో జనసేన తరఫున నామినేషన్లు వేసేందుకు అభ్యర్ధులు సైతం లేని పరిస్ధితి. దీంతో జనసేన పార్లమెంటు ఇన్ ఛార్జ్ లు కూడా తమ ఇళ్లకే పరిమితమవుతున్నారు. కాపు జనాభా అధికంగా ఉన్న తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సైతం జనసేన పరిస్దితి దారుణంగానే ఉంది. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాల్లో 641 ఎంపీటీసీ స్ధానాలకు జనసేన అభ్యర్ధులు నామినేషన్ వేశారు. అత్యల్పంగా కడప జిల్లాలో 24 మంది అభ్యర్ధులు మాత్రమే ఆ పార్టీ తరఫున నామినేషన్ వేశారు.
బీజేపీ పరిస్ధితీ దొందూదొందే..
తాజాగా పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేనతో పొత్తు పెట్టుకున్న బీజేపీ ఏపీ స్ధానిక పోరులో మాత్రం కలిసి ముందుకు వెళ్లడం లేదని అర్దమవుతోంది. తాజాగా ముగిసిన ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల పర్వంలో బీజేపీ తరఫున దాఖలైన మొత్తం నామినేషన్ల సంఖ్య 1816 అంటే పరిస్ధితి ఏ స్ధాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ఆ పార్టీకి చెందిన రాష్ట్ర స్ధాయి నేతలు కూడా ఈ ఎన్నికలను లైట్ తీసుకున్నట్లు తెలిసిపోతోంది.
మెజార్టీ పరిషత్ ఏకగ్రీవమే...
జడ్పీటీసీ, ఎంపీటీసీ స్ధానాలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసే సమయానికి దాదాపు 5 వేల స్ధానాల్లో వైసీపీ అభ్యర్ధులు మాత్రమే నామినేషన్లు వేయడంతో ఇవన్నీ ఏకగ్రీవం కానున్నాయి. అదే సమయంలో నామినేషన్ల పరిశీలన ముగిసిన తర్వాత మరో వెయ్యి స్ధానాల్లో వైసీపీకి ఏకగ్రీవమవుతాయని తెలుస్తోంది. దీంతో పరిషత్ పోరులో వైసీపీ ఏకగ్రీవం రూపంలో పైచేయి సాధించినట్లయింది. ఇదే పరిస్ధితి కొనసాగితే పంచాయతీ, పురపాలక ఎన్నికలపైనా వీటి ప్రభావం పడనుంది.