జగన్ సర్కారుకు మరో షాక్- ఎడ్యుకేషన్ హాలిడే ప్రకటించిన మెడికల్ కాలేజీలు..
ఏపీలో విద్యావ్యవస్ధ ప్రక్షాళనకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కొత్త సమస్యలను సృష్టిస్తున్నాయి. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో మేనేజ్ మెంట్ కోటా ఫీజులను తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆగ్రహంగా ఉన్న మెడికల్ కాలేజీలు ఈ విద్యాసంవత్సరం సెలవు ప్రకటించాయి. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ఓ లేఖ రాశాయి. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులతో కాలేజీలు నడపడం సాధ్యం కాదని యాజమాన్యాలు ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొన్నాయి.
ఇప్పటికే ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోటాను భర్తీ చేయొద్దని ప్రభుత్వాన్ని కోరుతున్న యాజమాన్యాలు, ఇప్పుడు ఏకంగా ఎడ్యుకేషన్ హాలిడీ ప్రకటించడం కలకలం రేపుతోంది. ప్రభుత్వం విద్యాసంస్ధల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు వీలుగా ఫీజుల నియంత్రణతో పాటు సదుపాయాలపై దృష్టిసారిస్తోంది. ప్రభుత్వం విధించిన మార్గదర్శకాల ప్రకారం కాలేజీలు నడపలేమని యాజమాన్యాలు చెబుతున్నాయి. ఇప్పటికే అన్ని కోటాల్లో ఫీజులను ప్రభుత్వం 70 శాతం తగ్గించేసిందని కాలేజీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం వెనక్కి తగ్గే అవకాశాలు కనిపించకపోవడంతో యాజమాన్యాలు ఎడ్యుకేషన్ హాలిడే ప్రకటించినట్లు చెబుతున్నాయి.
రెండు నెలలుగా కోవిడ్ 19 సేవల కోసం తమ కాలేజీలను ప్రభుత్వానికి అప్పగించామని, ఇప్పటికే నష్టాల్లో కూరుకుపోయామని యాజమాన్యాలు గుర్తు చేస్తున్నాయి. ప్రభుత్వం ఫీజులపై వెనక్కి తగ్గితే ఎడ్యుకేషన్ హాలిడేపై పునరాలోచించే అవకాశం ఉందని యాజమాన్యాలు చెబుతున్నాయి.