యువతిపై ఫ్రెండ్స్ రేప్, వీడియో: మార్ఫింగ్ చేశారని ఆ తర్వాత ఫిర్యాదు, నన్నపనేని హామీ
విజయవాడ: కృష్ణా జిల్లాలోని ఆగిరిపల్లి మండలంలో ఓ విద్యార్థినిపై సీనియర్ విద్యార్థులు అత్యాచారానికి పాల్పడి, సెల్ఫోన్లో వీడియో తీసి బెదిరింపులకు పాల్పడిన ఘటనలో పోలీసులు నిందితులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం వారిని కోర్టులో హాజరుపరిచారు. నిందితుల వేధింపులు ఎక్కువ కావడంతో బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన ఏడాదిన్నర తర్వాత వెలుగు చూసింది.
యువతిపై రేప్, వీడియో తీసి బెదిరింపులు: నిందితుల అరెస్ట్
ఇంజినీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్న విద్యార్థినిని అదే కాలేజీకి చెందిన సీనియర్లు కృష్ణవంశీ(ప్రసాదంపాడు), కొత్త శివారెడ్డి(ఉప్పలపాడు, ప్రకాశం జిల్లా)లు గత ఏడాది ఫిబ్రవరిలో బర్త్ డే అంటూ పిలిచి, కూల్ డ్రింక్లో మత్తు కలిపి, ఆ తర్వాత రేప్ చేశారు. దీనిని ఫోన్లో వీడియో తీసి, ఎవరికైనా చెప్తే సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. ఈ విషయాన్ని కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు.
అవే వీడియోలు చూపించి కోరిక తీర్చాలని డిమాండ్
వారు నిందితులను పిలిపించి సెల్ పోన్లోని వీడియోలను, ఫోటోలను తీసివేయించారు. కానీ ఇటీవల ప్రవీణ్ కుమార్(బొద్దనపల్లి, ఆగిరిపల్లి మండలం), అవే వీడియోలను బాధితురాలికి చూపించి కోరిక తీర్చాలని, లేదంటే రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన హనుమాన్జంక్షన్ పోలీసులు విచారణ జరిపారు. ముగ్గురు నిందితులను శనివారం రాత్రి వారి ఇళ్ల వద్ద అదుపులోకి తీసుకున్నారు.
అవసరమైతే యాజమాన్యంపై కేసు
ముగ్గురిపై ఐపీసీ 376డి, 354, 67 ఐటీఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అమ్మాయి జీవితం అల్లరిపాలు కావొద్దని కాలేజీ యాజమాన్యం రాజీ కుదిర్చినప్పటికీ.. తీవ్రమైన నేరాన్ని గోప్యంగా ఉంచడాన్ని తప్పుగా భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. యాజమాన్యానికి నోటీసులు జారీ చేస్తామని, అవసరమైతే కేసు నమోదు చేస్తామని తెలిపారు.
విద్యార్థిని బాధ్యత ప్రభుత్వానిది!
కాగా, బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడలోని ఆసుపత్రికి తీసుకు వచ్చారు. ఆమెను మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి పరామర్శించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎంను కోరుతామన్నారు. విద్యార్థిని తదుపరి చదువులు, ఉద్యోగం బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఆమె బాధితురాలి కళాశాలను కూడా సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ఇక్కడ ఓ కొత్త కోణం కనబడుతోందని, ముందుగా అమ్మాయి.. తన రింగ్, చైన్.. ఓ విద్యార్థి వద్ద ఉన్నాయని కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసిందన్నారు. దీంతో వాటిని విద్యార్థిని పేరెంట్స్కు యాజమాన్యం అప్పగించిందన్నారు.
మార్ఫింగ్ చేశారని ఆ తర్వాత ఫిర్యాదు
కాలేజీ వదలి వెళ్లే సమయంలో వచ్చి తన వీడియోలను మార్పింగ్ చేశారని యాజమాన్యానికి సదరు విద్యార్థిని ఫిర్యాదు చేసిందని నన్నపనేని తెలిపారు. యాజమాన్యం విచారించి అవి తొలగించేలా చర్యలు తీసుకుందని, పూర్తి వివరాలు చెప్పటానికి బాధితురాలు, పేరెంట్స్ ఇష్టంగా లేరని, ఘటన జరిగిన వెంటనే విషయం ఎందుకు చెప్పలేదని అమ్మాయిని అడగ్గా.. భయంతో చెప్పలేదని చెప్పిందన్నారు. బాధితురాలికి న్యాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమన్నారు. బాధితురాలు ఎంటెక్ చదివేందుకు ఆదుకుంటామన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత కళాశాల యాజమాన్యంపై ఉందన్నారు. ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ప్రారంభించాలని, విద్యార్థినులపై అసభ్యంగా ప్రవర్తించే విద్యార్థులను వెంటనే సస్పెండ్ చేసి కఠినంగా శిక్షించాలన్నారు.