ఉగండాలో తెలుగు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాల్చివేత
బంధువులు, కుటుంబ సభ్యులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి - రెడ్డికాలనీకి చెందిన దాసరి సాంబయ్య, అనసూయ దంపతులకు ముగ్గురు కుమారులున్నారు. రెండో కుమారుడు రఘురామ్ ఉద్యోగం కోసం ఏడాది క్రితం ఉగండా దేశానికి వెళ్లి అక్కడ నెట్వర్క్స్ సెక్యురిటీస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు.
శనివారం రాత్రి డబ్బు కోసం కొంత మంది దుండగులు రఘురామ్ను బెదిరించి, దారుణంగా కాల్చి చంపారు. ఆ సమాచారం ఆదివారం ఉదయం రఘురామ్ కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో ఆ కుటుంబంలో విషాద వాతావరణం నెలకొంది.
రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సారయ్య, పార్లమెంటు సభ్యుడు సిరిసిల్ల రాజయ్య, కాంగ్రెసు అర్బన్ అధ్యక్షుడు తాడిశెట్టి విద్యాసాగర్ తదితరులు ఆదివారం మధ్యాహ్నం రఘురామ్ ఇంటికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. రఘురామ్ మృతదేహాన్ని ఇక్కడికి త్వరగా తీసుకుని వచ్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.