జగన్ దెబ్బకు కేసీఆర్ లబోదిబో.. కరోనా టైమ్లో కుమ్మక్కు.. పోతిరెడ్డిపాడుపై పార్టీలు ఇలా..
శ్రీశైలం బ్యాక్ వాటర్ ను లిఫ్ట్ చేసి రాయలసీమకు తరలించడమే లక్ష్యంగా నిర్మించిన ప్రాజెక్టు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్. దీని సామర్థ్యాన్ని 40 వేల క్యూసెక్కుల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచేందుకు ఏపీ ప్రభుత్వం తాజాగా జారీచేసిన జీవో 203.. రెండు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టింది. ఏపీది ఏకపక్ష నిర్ణయమని, జీవో రద్దయ్యేలా ఆదేశాలివ్వాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణా వాటర్ మేనేజ్మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ) కు ఫిర్యాదు చేసింది. ఏపీ మాత్రం తన వాటా నీటిని మాత్రమే వాడుకుంటున్నామని, రాయలసీమకు నీళ్లు మానవతా దృక్ఫథంతో ఆలోచించాల్సిన అంశమని వాదిస్తోంది. తెలంగాణ ఫిర్యాదుపై స్పందించిన బోర్డు.. కృష్ణా మిగులు జలాల పంపకంపై భేటీకి పిలుపునిచ్చింది. ఈలోపే రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయ దుమారం మిన్నంటింది.
జల జగడం: జగన్పై కేసీఆర్ ఫైర్.. జీవో 203పై కృష్ణా బోర్డుకు ఫిర్యాదు.. ఏపీ ఘాటు స్పందన.. అసలేంటిది?
బంగారం వద్దు బుక్కెడు నీళ్లు ముద్దు..
పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు అక్రమమన్న సీఎం కేసీఆర్.. న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. అయితే ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు మాత్రం ఈ వ్యవహారాన్ని.. జగన్- కేసీఆర్ కలిసి ఆడుతోన్న నాటకంగా అభివర్ణించారు. సరిగ్గా కరోనా టైమ్ లోనే కుమ్మక్కు రాజకీయాలకు తెరలేపారని హస్తం పార్టీ నేతలు ఫైరయ్యారు. ‘‘జనాబ్ కేసీఆర్ సాబ్.. ఇవాళ రేషన్ సరుకులు పంచడానికి రంగారెడ్డి జిల్లా జల్ పల్లి మున్సిపాలిటీకి వెళ్లాను. అక్కడ జనమంతా సరుకుల కంటే ముందే తాగు నిళ్లు కావాలని మొరపెట్టుకున్నారు. బంగారు తెలంగాణ ఏమోగానీ, బుక్కెడు నీళ్లియమని జనం అడుగుతున్నారు. మీరేమో, సరిగ్గా కరోనా లాక్ డౌన్ టైమ్ చూసుకుని.. కృష్ణ నీళ్లను రాయలసీమకు పంపుతున్నారు. అయ్యా, ముందు రంగారెడ్డి, వికారాబాద్ ప్రజల గొంతు తడపండి, ఆ తర్వాత సీమ సంగతి చూద్దురుగానీ..''అని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కామెంట్ చేశారు.
ఆయుధం లేని యుద్ధం..
ఏపీ సర్కారు పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచడాన్ని నిరసిస్తూ తెంలంగాణ వ్యాప్తంగా బుధవారం నిరసనలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీతోపాటు బీజేపీ నేతలు, శ్రేణులు తమ కార్యాలయాల్లో దీక్షలు చేపట్టారు. జగన్ దెబ్బ కొట్టినట్లు చేస్తే, కేసీఆర్ లబోదిబోమన్నట్లు ఏడవటం నాటకంలో భాగమేనని, ఇద్దరు ముఖ్యమంత్రులు కూడబలుక్కునే కుట్రలకు తెరలేపారని ప్రతిపక్ష నేతలు ఘాటుగా విమర్శించారు. ‘‘కేసీఆర్ది నకిలీ పోరాటం. రాష్ట్ర ప్రయోజనాలను ఏపీకి తాకట్టుపెట్టేసి, ఇప్పుడు ఆయుధం లేకుండా యుద్ధం చేస్తానని బీరాలు పోతున్నాడు''అని నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, ఇవాళ పోతిరెడ్డిపాడు గురించి లొల్లి చేస్తున్న నేతలందరూ ఒకప్పుడు జలహారతులిచ్చిన దద్దమ్మలేనంటూ టీఆర్ఎస్ ఎదురుదాడికి దిగింది. తెలంగాణే ఆత్మగా బతికే కేసీఆర్.. రాష్ట్రానికి ఇంచు కూడా అన్యాయం జరగనీయబోరని గులాబీ నేతలు అన్నారు.
చంద్రబాబు సీమ బిడ్డకాడా?
పోతిరెడ్డిపాడుపై తెలంగాణలోని విపక్ష పార్టీలన్నీ సీఎం కేసీఆర్ ను విమర్శిస్తుంటే.. ఏపీలో మాత్రం వెరైటీగా అధికార పార్టీనే అపోజిషన్ నేతల్ని టార్గెట్ చేస్తోంది. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు విషయంలో వైఖరి చెప్పాలంటూ టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు వైసీపీ నేతలు సవాళ్లు విసిరారు. ఎంపీ విజయసాయిరెడ్డి మరో అడుగు ముందుకేసి చంద్రబాబు పేరును ప్రస్తావిస్తూ.. ‘‘శ్రీశైలం నుంచి రాయలసీమకు నీటిని పంపించే జీవో 203పై మీ స్టాండ్ ఏమిటి? అడ్డమైన విషయాలపై జూమ్ లో మాట్లాడే మీకు.. ఈ నెల 5న విడుదలైన జీవోపై మాట్లాడేందుకు వారం దాటినా మనసు రాలేదా? మీరు రాయలసీమ బిడ్డేనా? మీరు ఏపీవారేనా?'' అంటూ ఘాటు ప్రశ్నలు సంధించారు.
బీజేపీ డబుల్ గేమ్..
పోతిరెడ్డిపాటు విషయంలో జాతీయ పార్టీ బీజేపీ రెండు రాష్ట్రాల్లో రెండు విధానాలను అవలంభిస్తుండటం వివాదాస్పదమైంది. ఏపీ సీఎం జగన్ తీరును నిరసిస్తూ తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో ధర్నాలు చేపట్టగా, ఆంధ్రప్రదేశ్ బీజేపీ మాత్రం అదే జగన్ ను వెనకేసుకురావడం గమనార్హం. ఈ వివాదంపై మూడ్రోజులుగా మౌనం వహించిన ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ ఎట్టకేలకు బుధవారం గుంటూరులో మీడియాతో మాట్లాడారు. ‘‘జగన్.. కేసీఆర్ తో యుద్ధమా, ఇంకేదైనా చెయ్యనివ్వండి, ఎట్టిపరిస్థితుల్లోనూ రాయలసీమకు నీళ్లు రప్పించాల్సిందే. శ్రీశైలంలోని మిగులు జలాలను పోతిరెడ్డిపాడు ద్వారా తరలించే అవకాశముంది. దీనిపై గతంలోనే బీజేపీ పోరాటం చేసింది''అని కన్నా చెప్పారు.
Recommended Video
పవన్ది కూడా పువ్వుబాటే..
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ సామర్థ్యం పెంపు అంశంపై రెండు రాష్ట్రాల ప్రభుత్వాలే తలపడుతున్నవేళ, అన్ని పార్టీలు తమదైన పాత్ర పోషిస్తున్నా, జనసేన మాత్రం ఇప్పటిదాకా నోరుతెవకపోవడం గమనార్హం. అయితే బీజేపీ-జనసేన కలిసే ఉన్నాయికాబట్టి, కాషాయ నేతల వాదననే పవన్ కల్యాణ్ మాటగానూ భావించొచ్చని, రాయలసీమకు నీటి సరఫరాను ఆహ్వానించడం తప్ప జనసేనకు మరో ఆప్షన్ లేదనే వాదన ఏపీలో బలంగా వినబడుతోంది. ఎక్కువలో ఎక్కువ.. ఈ వివాదాన్ని కృష్ణా బోర్డే పరిష్కరించాలని పవన్ కోరే అవకాశాలున్నాయి.