జగన్ కు భారీ షాక్..అంతే గట్టిగా రివర్స్ ఎటాక్ - నీటి ప్రాజెక్టులపై వేడి.. తాజా వరదతో టెన్షన్ తగ్గేనా
సాగు పనులు ఊపందుకున్నవేళ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడాలు మళ్లీ వేడెక్కాయి. ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంపుపై కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) షాకింగ్ కామెంట్లు చేసింది. ఆ ప్రాజెక్టు చట్టవరుద్ధమేనని స్పష్టం చేసింది.
అయితే, ప్రాజెక్టుల విషయంలో ఇంచుకూడా వెనుకడుగు వేయబోమన్న జగన్ సర్కారు ఏకంగా బోర్డుపైనే రివర్స్ ఎటాక్ మొదలుపెట్టింది. పాత ప్రాజెక్టుల డీపీఆర్ లపై మరోసారి లేఖలు రాయొద్దంటూ బోర్డుపై ఫైరైంది. ఇదిలా ఉంటే, రెండుమూడు రోజులుగా ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తుండటం, ఏపీ, తెలంగాణలోని ప్రాజెక్టులకు వరద పోటెత్తుతుండటంతో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ల టెన్షన్ తగ్గొచ్చనే భావన వ్యక్తమవుతోంది.
సాయిరెడ్డికి దిమ్మతిరిగే పంచ్.. రఘురామ సాక్షిగా దేవధర్ ఎంట్రీ.. ప్రమాదంలో వైపీపీ.. సుజనా భారీ స్టెప్
బీజేపీ నేత లేఖతో..
శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీటిని.. రాయలసీమలోని నాలుగు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తరలించే ఉద్దేశంతో జగన్ సర్కారు.. సంగమేశ్వరం లిఫ్ట్ స్కీం, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీని 44 వేల క్యూసెక్కుల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచుతూ 203 జీవో జారీ చేయడాన్ని తెలంగాణ తీవ్రంగా తప్పుపట్టడం తెలిసిందే. దీనిపై కృష్ణా బోర్డులో వాడీవేడి వాదనలు జరగ్గా, పంచాయితీని కేంద్రమే పరిష్కరించాలని బోర్డు సూచించింది. ఇంతలోనే ఈ ప్రాజెక్టుల స్టేటస్ పై తెలంగాణ బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి ప్రధానమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు లేఖ రాయగా.. దానికి కేఆర్ఎంబీ సభ్యుడు హరికేశ్ మీనా బదులిచ్చారు.
ఏపీది ఉల్లంఘనే..
పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపునకు రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరిట ఏపీ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టుకు పరిపాలనాపరమైన అనుమతినివ్వడం చట్ట ఉల్లంఘనే అని కృష్ణా బోర్డు సభ్యుడు హరికేశ్ మీనా తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కూడా అభ్యంతరం చెబుతోన్న విషయాన్ని గుర్తుచేస్తూ, కనీసం అపెక్స్ కౌన్సిల్ నుంచి అనుమతి కూడా తీసుకోకుండా ఏపీ కొత్త ప్రాజెక్టు చేపట్టిందని, పునర్విభజన చట్టంలోని సెక్షన్ 84, 11వ షెడ్యూల్ ప్రకారం ఇది ముమ్మాటికీ ఉల్లంఘనే అవుతుందని మీనా తన సమాధానంలోపేర్కొన్నారు. కాగా, బోర్డు అభ్యంతరాలపై జగన్ సర్కారు తీవ్రంగా రియాక్ట్ అయింది.
ఎపీ రఘురామ వివాదంలో మరో మలుపు.. అరెస్టు భయంతో రక్షణ కోరిన రెబల్.. వైసీపీ ఫిర్యాదుల వెల్లువతో..
బోర్డుకు జగన్ సర్కారు ఘాటు లేఖ..
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్(సంగమేశ్వరం), పోతిరెడ్డిపాడు విస్తరణ ప్రాజెక్టులను కొత్తగా చేపట్టినట్లు పదే పదే అనడం ఏమాత్రం సరికాదని, రాష్ట్ర విభజనకు ముందునాటి ప్రాజెక్టుల డీపీఆర్లపై మరో సారి లేఖలు రాయొద్దని కృష్ణా బోర్డుకు జగన్ సర్కారు తీవ్రస్వరంతో చెప్పింది. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కేవలం మూడు ప్రాజెక్టులు మాత్రమే చేపట్టామని, అవి.. గుండ్రేవుల రిజర్వాయర్, ఆర్ఎస్ డీ రైట్ కెనాల్, వేదవతి రివర్ లిఫ్టు స్కీములు మాత్రమేనని, వాటి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు(డీపీఆర్)లు ఇంకా సిద్ధం కాలేదని, పూర్తయిన వెంటనే సమర్పిస్తామంటూ కేఆర్ఎంబీకి జగన్ సర్కారు శనివారం లేఖ రాసింది. ఈ లేఖ విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించిన జగన్ సర్కారు.. ఎక్కడా సంగమేశ్వరం, పొతిరెడ్డిపాడుల పేర్లను ప్రస్తావించకుండా తన వాదనను బలంగా వినిపించడం గమనార్హం.
గోదావరిపై ముదిరిన గొడవలు..
కృష్ణా జలాలతోపాటు ఇటు గోదావరి నీటిపైనా తెలుగు రాష్ట్రాల మధ్య గొడవలు ముదిరాయి. పోలవరం ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా నీటిని.. కృష్ణా, పెన్నా బేసిన్కు తరలించేలా ఏపీ సర్కారు ప్రాజెక్టుల్ని రూపొందిస్తున్నదని, వాటిని వెంటనే అడ్డుకోవాంటూ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ)ను కేసీఆర్ ప్రభుత్వం కోరింది. దాదాపు 18వేల క్యూసెక్కులుగా ఉన్న పోలవరం కుడి కాలువ కెపాసిటీని 50వేల క్యూసెక్యులకు పెంచి, తద్వారా 300 టీఎంసీల నీటిని ఇతర బేసిన్లకు తరలించేందుకు సిద్ధమైందని, ఇందుకోసం రూ.68 వేల కోట్ల అంచనాతో ప్రణాళికలు వేసిందని, విభజన చట్టం ప్రకారం ఇది ఉల్లంఘన అవుతుందని గోదావరి బోర్డుకు రాసిన లేఖలో తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది.
Recommended Video
వరద పోటుతో టెన్షన్ తీరేనా?
ఎగువ రాష్ట్రాలైన కర్నాటక, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండటంతో.. ఏపీ, తెలంగాణలోని ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. కృష్ణా, గోదావరి బేసిన్లు రెండిటికీ దాదాపు ఒకేసారి జల ప్రవాహం మొదలైంది. కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్టుకు శనివారం 73,791 క్యూసెక్కుల వరదరాగా, అక్కణ్నుంచి 27,756 క్యూసెక్కుల నీరు నారాయణపూర్కు విడుదల చేశారు. జూరాల ప్రాజెక్టుకు ఇప్పటికే 1,488 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా, మూడు నాలుగు రోజుల్లో అది భారీగా పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి ఇన్ప్లో పెరగొచ్చన్న అంచనాలతో నీటి విడుదల సామర్ద్యాన్ని అంచెలంచలుగా పెంచాలని అధికారులు నిర్ణయించారు. గోదావరి బేసిన్ లోని శ్రీరామసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ)కు సైతం వరద పెరిగింది. శనివారం నాటికి 9,643 క్యూసెక్కుల వరద నీరు వస్తుండటంతో.. ఈ నెల 15 నుంచి ఎస్సారెస్పీ ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేస్తామని అధికారులు చెప్పారు. రెండు బేసిన్లకూ నీళ్లు వస్తుండటంతో తెలుగు రాష్ట్రాల నీటి గొడవల్లో వేడి తగ్గొచ్చని, తాత్కాలికంగానైనా టెన్షన్ సడలిపోవచ్చనే ఆశాభావం వ్యక్తమవుతోంది.