తెలంగాణాకు ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన షాక్ మామూలుగా లేదుగా .. గోదావరిపై 16 ప్రాజెక్ట్ లకు బ్రేక్
ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య జల రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. తెలంగాణా కృష్ణా జలాలపై ఏపీ నిర్ణయాన్ని కార్నర్ చేసి కృష్ణా రివర్ బోర్డుకు ఫిర్యాదు చేస్తే ఏపీ గోదావరిపై తెలంగాణా ప్రాజెక్ట్ లను టార్గెట్ చేసింది . గోదావరి నదిపై ప్రాజెక్ట్ ల విషయంలో తెలంగాణాకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.
తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త జల జగడం ... తగ్గేదెవరో... నెగ్గేదెవరో !!
పోతిరెడ్డి పాడు విషయంలో ఎపీపై తెలంగాణా సర్కార్ ఫిర్యాదు
మొన్నటికి మొన్న శ్రీశైలం ఎగువన పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతల ద్వారా నీటిని రాయలసీమకు తరలించడానికి ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసిన నేపథ్యంలో ఈ విషయంపై తెలంగాణ సర్కార్ కృష్ణా రివర్ బోర్డు కు ఫిర్యాదు చేసింది. ఇక ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటున్న నేపథ్యంలో కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టుల విషయంలో త్వరలోనే కృష్ణ రివర్ బోర్డు సమావేశం కానుంది. అదలా ఉంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు విషయంలో చేసిన పనికి రివెంజ్ తీర్చుకునే పనిలో పడింది ఏపీ.
గోదావరి నదిపై తెలంగాణా ప్రాజెక్ట్ ల నిర్మాణం పై ఏపీ ఫిర్యాదు .. నిర్మాణాలకు బ్రేక్
అందులో భాగంగా గోదావరి నదిపై తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులకు సంబంధించి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ఏపీ ఫిర్యాదు చేసింది. దీంతో ఆ ఫిర్యాదుపై విచారణ జరిపిన గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు తెలంగాణ ప్రభుత్వానికి షాక్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు అనుబంధంగా ఉన్నప్రాజెక్టుల నిర్మాణంపై బ్రేకులు వేసింది గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు. భారీ నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణాలను వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసిన బోర్డు అపెక్స్ బోర్డు అనుమతి లేకుండా ప్రాజెక్టుల నిర్మిస్తున్నారని అందుకే, నిలిపివేయాలని ఆదేశిస్తున్నట్లుగా ఉత్తర్వులు జారీ చేసింది.
మొత్తం 16 ప్రాజెక్టుల నిర్మాణ పనులకు బ్రేక్ వేసిన గోదావరి రివర్ బోర్డు
ప్రస్తుతం గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు వెబ్ సైట్ లో ఉన్న వివరాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 16 ప్రాజెక్టుల నిర్మాణ పనులు జరుగుతున్నాయి.ముఖ్యంగా చూస్తే ప్రాణహిత-చేవెళ్ల, దేవాదుల, కాళేశ్వరం ఎల్ ఐ ఎస్, దుమ్ముగూడెం, లెండి, లోయర్ పెన్ గంగ, మిడ్ మానేరు డ్యాం వంటి ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇక ఈ ప్రాజెక్టులన్నింటి నిర్మాణ పనులు వెంటనే ఆపేయాలని గోదావరి రివర్ బోర్డు తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
గోదావరి , కృష్ణా జలాల విషయంలో ఇరు రాష్ట్రాల ఫిర్యాదుల పరంపర
తెలంగాణ రాష్ట్రం అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వివిధ ప్రాజెక్టుల వల్ల ఏపీ ప్రయోజనాలకు భంగం కలుగుతుందని చేసిన ఫిర్యాదు మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు కృష్ణా నదీ జలాల వినియోగం విషయంలో కూడా రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం ఇంతవరకు సమసిపోలేదు. ఇది మరింత పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ జల వివాదానికి సంబంధించి రెండు రాష్ట్రాలు సమావేశమై చర్చలు జరగనున్నప్పటికి ఇద్దరు ముఖ్యమంత్రులు పట్టిన పట్టు విడవని ముఖ్యమంత్రులు కావడంతో కృష్ణా జలాలకు సంబంధించి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్ ఎలా జరుగుతుందో అన్న ఆసక్తి కూడా నెలకొంది.
Recommended Video
బయటకు కలిసే ఉన్నామన్నా రచ్చ చేస్తున్న జల వివాదాలు
ఏదేమైనప్పటికీ అటు ఏపీ, ఇటు తెలంగాణ నీటి వినియోగం విషయంలో ఏ మాత్రం తగ్గకుండా రాష్ట్రాల ప్రయోజనాల కోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. బయటకు కలిసున్నామని చెప్పినా, అంతర్గతంగా జల వివాదాలతో ఉత్కంఠ కలిగిస్తున్నాయి. ఇక తాజా షాక్ తో ఏపీ, తెలంగాణలో నీటి పంచాయతీ వేడి పుట్టిస్తోంది. ఇరు రాష్ట్రాల్లో పరస్పర ఫిర్యాదులు , ఇక వాటర్ బోర్డుల విచారణలు రాజకీయ దుమారం రేపుతున్నాయి.