సెల్ ఫోన్ కోసం...చంద్రబాబునే ఖంగుతినిపించిన అంగన్వాడీ మహిళలు
విజయవాడ:అధికారులు ఇచ్చిన రాంగ్ ఇన్ఫర్మేషన్ సిఎం చంద్రబాబుకు ఇబ్బందికరంగా మారిన ఘటన అంగన్ వాడీ మహిళల సమావేశంలో చోటుచేసుకుంది. గురువారం విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన అంగన్వాడీల ఆత్మీయ సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు అంగన్ వాడీలకు ఇచ్చిన హామీల నెరవేర్పు గురించి ప్రస్తావించారు. గతంలో అంగన్వాడీలకు సెల్ఫోన్లు ఇస్తామని ప్రకటించిన చంద్రబాబు...ఎంతమందికి సెల్ఫోన్లు అందాయో చేతులు ఎత్తాలని కోరారు. కానీ అంగన్ వాడీలు దాదాపుగా అందరూ చేతులెత్తడంతో చంద్రబాబు షాక్ తిన్నారు.
దీంతో వారికి సెల్ ఫోన్ ల పంపిణీ ఇంకా జరగలేదని గ్రహించిన చంద్రబాబు అధికారులు తనకు ఇచ్చిన రాంగ్ ఇన్ఫర్మేషన్ కారణంగా అలా జరిగిందని అర్థం చేసుకున్నారు. అదే విషయాన్ని అంగన్ వాడీలకు తెలిపారు. అధికారులు సెల్ఫోన్లు ఇవ్వకుండానే తనతో ఇచ్చినట్లు తప్పుడు సమాచారం ఇచ్చారని చంద్రబాబు చెప్పారు. అయితే ఆగస్టు 15 కల్లా అంగన్వాడీలకు సెల్ ఫోన్లు అందిస్తామని హామీ ఇచ్చారు.
అయితే సెల్ ఫోన్ ఇస్తామని స్వయంగా సిఎం చంద్రబాబే ఎప్పుడో హామీ ఇచ్చినా అధికారులు ఇంతవరకు అమలు పరచక పోవడం సరికాదని అంగన్ వాడీ మహిళలు ఈ సందర్భంగా తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే అంగన్వాడీలు, ఆశా వర్కర్లపై సిఎం చంద్రబాబు మరోసారి వరాల జల్లు కురిపించారు. ఇటీవలే వారికి వేతనాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. వచ్చే నెలలో వారు కొత్త జీతాలు అందుకోనున్నారు.
ఇప్పటివరకూ అసంఘటిత కార్మికులకు చంద్రన్న బీమా వర్తింపజేస్తూ వచ్చారు. తాజాగా అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లకు ఈ చంద్రన్నబీమా వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి ఈ సమావేశంలో ప్రకటించారు. ఈ బీమా పథకం ద్వారా సహజంగా మరణిస్తే.. రూ. రెండు లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ. 5 లక్షలు, ప్రమాదంలో పూర్తిగా అంగవైకల్యం ఏర్పడితే రూ. 5 లక్షలు, పాక్షిక అంగవైకల్యం ఏర్పడితే రూ. 2.50 లక్షలు చంద్రన్నబీమా ద్వారా ఆ కుటుంబానికి అందజేస్తారు.
ఇప్పటికే వేతనాలు పెంచిన సీఎం.. తాజాగా చంద్రన్న భీమాను కూడా వర్తింపజేయడం తో అంగన్వాడీలు, ఆశా వర్కర్లలో ఆనందం వెల్లివిరుస్తోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, మంత్రి పరిటాల సునీతకు వారు కృతజ్ఞతలు తెలిపారు.