మాజీ మంత్రి అనిల్ సంచలనం - సొంత పార్టీ నేతల కుట్రలు : టీడీపీతో కలిసి...!!
మాజీ మంత్రి అనిల్ సంచలన వ్యాఖ్యలు చేసారు. వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా ఉన్న ఆయన సొంత పార్టీ నేతలు కొందరు టీడీపీతో కలిసి కుట్రలు చేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారని..వాళ్ల చరిత్ర తన వద్ద ఉందని చెప్పుకొచ్చారు. ఓపిక పట్టి చూస్తున్నానంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు నెల్లూరు జిల్లాతో పాటుగా వైసీపీలో కలకలం రేపుతున్నాయి. మాజీ మంత్రి అనిల్ కు జగన్ తన కేబినెట్ లో ఇరిగేషన్ శాఖా మంత్రిగా అవకాశం కల్పించారు. విస్తరణలో భాగంగా అనిల్ ను తప్పించి నెల్లూరు జిల్లా నుంచి కాకాణి గోవర్ధన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు.
నెల్లూరులో వైసీపీ నేతల కోల్డ్ వార్
ఆ సమయంలో ఈ ఇద్దరి తీరుతో వీరి మధ్య గ్యాప్ పెరిగింది. దీంతో.. నేరుగా ముఖ్యమంత్రి జగన్ ఇద్దరితోనూ వేర్వేరుగా సమావేశం అయ్యారు. ఆ తరువాత ఇద్దరు కలుసుకున్నారు. అయితే, అనిల్ నెల్లూరు నగర రాజకీయాల్లో తనకు వ్యతిరేకంగా కొందరు పార్టీ నేతల తీరు పైన కొంత కాలంగా ఆగ్రహంతో ఉన్నారు. కొన్ని సందర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇక, ఇప్పుడు తాజాగా.. కొందరు సొంత పార్టీ నేతలే టీడీపీతో కలిసి వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. వారి ఫోన్ కాల్ హిస్టరీ తన వద్ద ఉందని అనిల్ చెప్పుకొచ్చారు. నెల్లూరు నగరంలో ఆయన గడగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు.
సాటి ఎమ్మెల్యేలే వెన్నుపోటు
సొంత పార్టీలోని సాటి ఎమ్మెల్యేలే వెన్నుపోటు పొడుస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలో తనను బలహీన పర్చేందుకు కుట్రలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. తెలుగు దేశం పార్టీ నాయకులకు డబ్బులిచ్చి తన పైన అసత్య ప్రచారాలు చేయిస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. టీడీపీ నేతలకు డబ్బులిచ్చి తనను తిట్టిచ్చే స్థాయికి దిగజారారని మండిపడ్డారు. వైసీపీలో ఉన్న ఓ నేత ఇటువంటి సిగ్గుమాలిన పనులు చేస్తున్నారంటూ అనిల్ విరుచుకుపడ్డారు. టీడీపీకి చెందిన ఒక నేత వైసీపీ నేతలు..ఎమ్మెల్యేలతో మంతనాలు సాగిస్తూ రోజుకు రూ వేలు తీసుకుంటున్నారని. మరకొరు రూ లక్ష వరకు సంపాదిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ రెండు బ్యాచ్ ల చరిత్ర తన వద్ద ఉందని అనిల్ చెప్పారు.
అన్నీ బయట పెడతానంటూ
తాను ఓపిక పడుతున్నానని.. సమయం వచ్చినప్పుడు అన్నీ బయట పెడతానని హెచ్చరించారు. నెల్లూరు జిల్లా వైసీపీకి కంచుకోటగా ఉంది. 2019 ఎన్నికల్లో జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాలు వైసీపీ గెలుచుకుంది. జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేల మధ్య కొంత కాలంగా కోల్డ్ వార్ కొనసాగుతోంది. ఇప్పుడు తారా స్థాయికి చేరింది. గతంలో పార్టీ ముఖ్య నేతలు నెల్లూరులో పార్టీ నేతలతో సమావేశం ఏర్పాటు చేసి సఖ్యత కోసం సూచనలు చేసారు. కానీ, ఇప్పుడు మాజీ మంత్రి అనిల్ వ్యాఖ్యలతో నెల్లూరు పార్టీ పరిస్థితి పైన మరోసారి చర్చ మొదలైంది. ఇప్పుడు అనిల్ వ్యాఖ్యల పైన పార్టీ అధినాయకత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.