జగన్కు శాసన సభ పలకడం రాదు, ఇదీ లోకేష్ సత్తా: రోజాకు అనిత
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజాకు టిడిపి ఎమ్మెల్యే అనిత గురువారం కౌంటర్ ఇచ్చారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రోజా టిడిపిపై దుమ్మెత్తిపోశారు. దీనిపై అనిత స్పందించారు.
'రూ.7 కోట్ల లోన్తో చంద్రబాబు ఇల్లు కట్టారు, జగన్ ఇల్లు చూడండి'
తిరుమలో రాజకీయమా?
పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో రోజా రాజకీయాలు మాట్లాడటం విడ్డూరమన్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి తన పాత ఇంటినే మార్పులు చేసి ఓ ఇంటిని కట్టుకోవద్దా అని నిలదీశారు. చంద్రబాబు ఇంటిపై రకరకాల విమర్శలు చేయడం ఏమిటన్నారు.
చంద్రబాబు ఇల్లు కట్టుకోవద్దా?
హైదరాబాదులో తన పాత ఇంటినే కూల్చివేసి, ముఖ్యమంత్రి అయిన రెండేళ్ల తర్వాత అదే స్థానంలో ఇల్లు కట్టుకోవడాన్ని విమర్శించడం సిగ్గుచేటు అన్నారు. ఆయన ఇంటిని నిర్మించుకోవద్దా అని నిలదీశారు. చంద్రబాబు ఇంటిపై విమర్శలు బాధను కలిగిస్తున్నాయన్నారు.
జగన్కు శాసన సభ అనడమే రాదు
అలాగే, మంత్రి నారా లోకేష్ గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు. లోకేష్కు లేని అర్హత ఏమిటన్నారు. లోకేష్ ప్రతి ఒక్కరితో చక్కగా తెలుగు మాట్లాడుతారని చెప్పారు. అసలు జగన్కు, వారి ఎమ్మెల్యేలకు శాసన సభ అని పలకడమే రాదని అనిత ఎద్దేవా చేశారు.
లోకేష్ అర్హత ఇదీ..
ఇదే విషయాన్ని అసెంబ్లీలో కూడా చెప్పానని అన్నారు. మొదట శాసన సభ అని పలకడం రాని వ్యక్తులు, చదువు రాని వ్యక్తులు ఇలా మాట్లాడుతున్నారన్నారు. చదువు విలువ తెలియక లోకేష్ గురించి మాట్లాడుతున్నారన్నారు. కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్తగా లోకేష్ ఎలా పని చేశారో అందరికీ తెలుసునని చెప్పారు. అలాంటి వ్యక్తికి మంత్రి పదవి ఇస్తే రాజకీయమా అన్నారు.