అన్న క్యాంటీన్ల చుట్టూ రాజకీయాలు: సొంత ఖర్చుతో అన్నం పెట్టిన టీడీపీ ఎమ్మెల్యే!
Recommended Video
అమరావతి: రాష్ట్రంలో ఒక్కటొక్కటిగా మూతపడుతున్న అన్నా క్యాంటన్ల చుట్టూ రాజకీయాలు ముసురుకుంటున్నాయి. క్యాంటీన్ల మూసివేతను అడ్డుగా పెట్టుకుని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడుతోంది తెలుగుదేశం. ప్రభుత్వాన్ని విమర్శించడానికి దొరికిన ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడానికి ఎంత మాత్రమూ సిద్ధంగా లేరు ఆ పార్టీ నాయకులు. నిరుపేదలకు అతి తక్కువ ధరలకే ఆహారాన్ని అందజేయడానికి తమ ప్రభుత్వం నెలకొల్పిన అన్న క్యాంటీన్లను నడపటం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చేత కావట్లేదని తెలుగుదేశం పార్టీ నాయకులు ఘాటుగా విమర్శిస్తున్నారు. టీడీపికి చెందిన పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఓ అడుగు ముందే ఉన్నారు. పాలకొల్లులో మూతపడ్డ అన్నక్యాంటీన్ వద్ద షామియానా వేసి మరీ.. సొంత ఖర్చుతో పేదలకు భోజనం పెట్టారు.
పోలీసుల దాష్టీకం: అన్నదాతలపై విరిగిన లాఠీ!
మూతపడ్డ క్యాంటీన్ల వద్ద నిరసన దీక్షలు..
గురువారం నుంచీ మూత పడ్డ అన్న క్యాంటీన్ల అంశాన్ని తెలుగుదేశం పార్టీ రాజకీయం చేస్తూనే వస్తోంది. మూతపడ్డ క్యాంటీన్ల గేట్లకు వేసిన తాళల ఫొటోలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా మూతపడ్డ 204 అన్న క్యాంటీన్ల వద్ద తెలుగుదేశం నాయకులు ఆందోళలకు సిద్ధపడుతున్నారు. క్యాంటీన్ల వద్ద నిరసన దీక్షలు చేపట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అన్న క్యాంటీన్లను మూసివేయట్లేదని ప్రభుత్వం పదే పదే చెబుతోంది. ఈ పథకంలో అనేక లోపాలు ఉన్నాయని, నిరుపేదల పేరుతో కోట్ల రూపాయలను తెలుగుదేశం పార్టీ నాయకులు దిగమింగారని, వాటిని సరి చేయడానికి తాత్కాలికంగా వాటిని మూసివేయాల్సి వస్తోందని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నిండు సభలో ప్రకటించారు.
క్యాంటీన్ల నిర్వహణలో లొసులుగు నిజమేనా?
రాష్ట్రంలో మరో ఏడెనిమిది నెలల్లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు వస్తాయనగా.. అప్పటికప్పుడు, హడావుడీగా తెలుగుదేశం ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 2014లో ఇచ్చిన హామీని 2018 చివరిలో అమలు చేయడం వెనుక రాజకీయ ఉద్దేశం ఉందని, ఎన్నికలకు ముందు పేదల ఆకలి గుర్తుకొచ్చిందా? అంటూ అప్పట్లో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. దీనికితోడు- క్యాంటీన్ల నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుందంటూ ఆరోపణలు వచ్చాయి. ఒక్కో క్యాంటీన్ నిర్మాణానికి అయిదారు లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉండగా.. 30 నుంచి 40 లక్షల రూపాయల మేర బిల్లులు చూపించారని వైఎస్ జగన్ ప్రభుత్వం చెబుతోంది. వాటన్నింటినీ ప్రక్షాళణ చేయాల్సి ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. లొసుగులను సరి చేసి, సరికొత్తగా క్యాంటీన్లను పునరుద్ధరిస్తామని అంటున్నారు.
70 కోట్లకు పైగా బకాయిలు..
ఒక్కో జిల్లాలో 10 నుంచి 25 వరకు అన్నా క్యాంటీన్లు కొనసాగుతున్నాయి. జిల్లా విస్తీర్ణాన్ని బట్టి వాటి సంఖ్యను పొడిగించారు. ఉదాహరణకు విశాఖపట్నం జిల్లాలో 30కి పైగా క్యాంటీన్లు ఏర్పాటయ్యాయి. ఇందులో సుమారు 20 వరకు క్యాంటీన్లు విశాఖపట్నం పరిధిలోనే ఉన్నాయి. వాటి నిర్వహణకు సుమారు 15 కోట్ల రూపాయల మొత్తాన్ని ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. ఈ లెక్కన చూసుకుంటే రాష్ట్రవ్యాప్తంగా 70 కోట్ల రూపాయలను అన్నా క్యాంటీన్ల కోసం విడుదల చేయాల్సి ఉందని అక్షయపాత్ర ప్రతినిధులు తెలిపారు. ప్రభుత్వం నుంచి బిల్లులు అందకపోవడం వల్ల ఇక వాటి నిర్వహణ భారంగా మారిందని, దీన్ని కొనసాగించే అవకాశాలు ఇక లేనట్టేనని వారు వెల్లడించారు. క్యాంటీన్లను మూసివేయాలంటూ ఇప్పటిదాకా కూడా తమకు స్థానిక సంస్థల అధికారుల నుంచి ఎలాంటి లిఖితపూరక ఆదేశాలు అందలేదని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది జులై వరకు తమ కాంట్రాక్టు గడువు ఉన్నందున.. వాటిని పునరుద్ధరిస్తామని, సరికొత్తగా తీర్చిదిద్దుతామని మున్సిపల్ శాఖ అధికారులు మౌఖికంగా తెలియజేశారని అక్షయపాత్ర వెల్లడించింది.
మూతపడ్డ క్యాంటీన్ వద్ద భోజనం
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్న క్యాంటీన్ల మూసివేతపై వినూత్నంగా నిరసన తెలిపారు. క్యాంటీన్ ఎదురుగా షామియానాలు వేసి, పేదలకు భోజనం పెట్టారు. సుమారు 300 మంది ఇక్కడ భోజనం చేశారని, ప్రభుత్వం పేదల కడుపు కొడుతోందని రామానాయుడు ఆరోపించారు. అన్నక్యాంటీన్లను కొనసాగిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ అసెంబ్లీలో రెండురోజుల కిందటే ప్రకటించారని ఆయన గుర్తుచేశారు. అయినప్పటికీ వాటిని మూసేశారని.. ప్రభుత్వ పాలన ఏ విధంగా అసత్యాలతో సాగుతోందో ఇదే తార్కాణమని చెప్పారు. రాజకీయ కక్షలు ఉంటే తమపై తీర్చుకోవాలే తప్ప పేదలపై ప్రదర్శించకూడదని ఆయన ఆరోపించారు. అన్న క్యాంటీన్ల రంగు మార్చుతారని తాము మొదట భావించామని, ఏకంగా వాటిని మూసేయించడం సరి కాదని ధ్వజమెత్తారు.