త్వరలో అన్నక్యాంటీన్లు: అసెంబ్లీలోను, రేసులో ఇస్కాన్
హైదరాబాద్: తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించాలనుకున్న అన్న క్యాంటీన్లు త్వరలో విశాఖపట్నంలో ప్రారంభం కానున్నాయి. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పోరేషన్ అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు సిద్ధం చేస్తోంది. తమిళనాడులో అక్కడి ముఖ్యమంత్రి జయలలిత అమ్మ క్యాంటీన్లు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
అమ్మ క్యాంటీన్లను పరిశీలించిన తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఒక్క విశాఖలోనే 15 అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నారట. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నారట. వీటిని భరించే పరిస్థితి కనిపిస్తే విడతలవారిగా పెంచుతారు.
ఒక్కో క్యాంటీన్కు రూ.1.50 విలువైన సబ్సిడీ మెటిరీయల్ ఇవ్వనున్నారు. గ్యాస్, పాత్రలు, విద్యుత్ పరికరాలు, రామెటిరీయల్స్ తదితరాలు ఇవ్వనున్నారు. వీటిని సెల్ప్ హెల్ప్ గ్రూప్ మహిళలు నడపనున్నారు. ఒక్కో మహిళకు ఒక్కో రోజుకు రూ.300 రోజులు ఇవ్వనున్నారని తెలుస్తోంది. విశాఖలాగే ఏపీలోని మరో మూడు ప్రాంతాల్లోను ఇదే తరహా క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నారు.
కాగా, శాసనసభ ప్రాంగణంలోనూ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై చర్చించేందుకు మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. తమిళనాడు తరహాలో సబ్సిడీ రేట్లపై అల్పాహారం అందించేందుకు ఆంధ్రప్రదేశ్లో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అన్న క్యాంటీన్ల నిర్వహణ ఎవరికి ఇవ్వాలనే విషయమై కమిటీ చర్చించిది. ఇస్కాన్తో పాటు పలు సంస్థలు అన్న క్యాంటీన్ల నిర్వహణకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఆసక్తి ఉన్న స్వచ్చంధ సంస్థల వివరాలు ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించారు.