అన్న క్యాంటీన్లు:రూ 15 కే మూడు పూటలా భోజనం...365 రోజులు అందుబాటులోనే...
అమరావతి:పేదవాడికి పట్టెడన్నం పెట్టాలన్న సదుద్దేశ్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలోనే అన్న క్యాంటీన్లను ప్రారంభించనుంది. ఈ అన్న క్యాంటీన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బుధవారం కొన్ని కీలకమైన మార్గదర్శకాలు జారీ చేసింది.
ఈ అన్న క్యాంటీన్లలో 15 రూపాయలకే మూడుపూటలా భోజనం చేసే అవకాశం కల్పించడంతో పాటు వీటిని 365 రోజులూ అందుబాటులో ఉంచనున్నట్లు ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది. అంతేకాదు ఈ అన్న క్యాంటీన్ల నిర్వహణలో ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా ఎల్లప్పుడూ పర్యవేక్షించేందుకు దేశంలోనే తొలిసారిగా ఒక ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించనుండటం విశేషం.
అతి త్వరలో...అన్న క్యాంటీన్లు
ఎపి ప్రభుత్వం అతి త్వరలో ప్రారంభించనున్న అన్న క్యాంటీన్లకు సంబంధించి కీలకమైన మార్గదర్శకాలను బుధవారం విడుదల చేసింది. ఈ అన్న క్యాంటీన్లు ఏడాదిలో 365 రోజులూ పని చేయనున్నట్లు, రూ. 15 రూపాయాలకే ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం ప్రభుత్వం ఆ మార్గదర్శకాల్లో పేర్కొంది. ఒక్కో పూటకు కనీసం 350 మందికి అల్పాహారం/ఆహారం అందించేలా వీటిని రూపొందించనున్నారు.
తొలి విడతలో...40 క్యాంటీన్లు
50వేల జనాభా పైబడిన 71 పట్టణాల్లో... 203చోట్ల ఈ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడతగా 40 క్యాంటీన్లను వారంరోజుల్లో ప్రారంభించేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అనంతరం ఒకటి, రెండు నెలల్లో మొత్తం క్యాంటీన్లు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. రానున్నాయి. దేశంలో మొదట తమిళనాడు, ఆ తరువాత కర్ణాటక ఈ తరహా క్యాంటీన్లు ఏర్పాటుచేయగా..ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీటిని ప్రారంభించనుంది.
అక్షయపాత్రదే...టెండర్
ఈ అన్న క్యాంటీన్లలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం కలిపి రూ.15కే అందించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఏటా రూ.131 కోట్లు ఖర్చు చేయనుంది. తగిన సదుపాయాలతో ఒక్కో క్యాంటీన్ నిర్మాణానికి రూ.36 లక్షలు చొప్పున మరో రూ.80 కోట్లు వెచ్చిస్తున్నారు. 750 చదరపు అడుగుల విస్తీర్ణంలో చేపట్టే ఈ భవనాల్లో తాగునీటి సదుపాయం, వికలాంగులకు ప్రత్యేక ఏర్పాటు, ఇంటర్నెట్ సౌకర్యం, ఎల్సీడీలు, సీసీ టీవీలతో పాటు చుట్టూ ప్రహరీ గోడ ఏర్పాటు చేయనున్నారు. ఆధార్ అనుసంధానించి ప్రజల నుంచి బయోమెట్రిక్ తీసుకొని ఎలక్ట్రానిక్ విధానంలో టోకెన్లు జారీ చేయడం జరుగుతుంది. వీటిలో ఆహారం తయారీ, పంపిణీ టెండర్ను అక్షయపాత్ర సంస్థ దక్కించుకున్న సంగతి తెలిసిందే.
టెక్నాలజీతో...సమీక్ష
ఈ అన్నా క్యాంటీన్లలో ఆహారంతో పాటు విభిన్న సదుపాయాలు కల్పిస్తున్నందున వీటి నిర్వహణా తీరును ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు రియల్ టైం మోనిటరింగ్ సిస్టంను ప్రవేశపెడుతున్నారు. తద్వారా వీటి పనితీరును సెక్రటేరియట్ నుంచే ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడు గమనించవచ్చు. అంతేకాదు ఆహార పదార్థాల నాణ్యతపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేలా ప్రత్యేకంగా సాఫ్ట్వేర్, హార్డ్వేర్ పరికరాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు.