చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలి..లేకుంటే ఆమరణ దీక్ష చేస్తా: సభా సాక్షిగా ఎమ్మెల్యే హెచ్చరిక...!
ఏపి శాసనసభా బడ్జెట్ సమావేశాల్లో చివరి రోజు ఆసక్తి కర సన్నివేశం చోటు చేసుకుంది. గత వారం ఫిరాయింపుల మీద సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే రాజీనామా చేస్తానని హెచ్చరించిన ఎమ్మెల్యే అన్నే రాంబాబుకు స్పీకర్ చివరి రోజు అవకాశం ఇచ్చారు. ఆ సమయంలో రాంబాబు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫిరాయింపుల ప్రోత్సహించిన తీరు మీద ఫైర్ అయ్యారు. ఆ సమయంలో పార్టీలో చాలామంది వద్దని చెప్పినా..అవమానించేలా మాట్లాడారంటూ ఆవేదన వ్యక్తం చేసారు. చంద్రబాబు మీద చర్యలు తీసుకోకుంటే..తాను ఆయన ఇంటి ముందే ఆమరణ దీక్ష చేస్తానని రాంబాబు సభలోనే స్పీకర్..ముఖ్యమంత్రి సాక్షిగా ప్రకటించారు.
Recommended Video
చంద్రబాబుకు సభలో ఉండే అర్హత లేదు..
గత ప్రభుత్వంలో చోటు చేసుకున్న ఫిరాయింపుల పైన గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే రాంబాబు సభలో భావోద్వేగంగా ప్రసంగించారు. గత వారం ఇదే అంశం పైన తనకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వాలని లేకుంటే రాజీనామా చేస్తాన ని రాంబాబు అల్టిమేటం జారీ చేసారు. దీంతో..సమావేశాల ముగింపు రోజున స్పీకర్ ఆయనకు అవకాశం ఇచ్చారు. గత ప్రభుత్వంలో 23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి తన పార్టీలో చేర్చుకుంటే తాను ప్రశ్నించానని గుర్తు చేసారు. అయితే, తనను కులం పేరు పెట్టి..నీకు ఏమీ తెలియదంటూ అవహేళన చేసారని చెప్పుకొచ్చారు. ఇదే విషయం పైన తాను టీడీపీని వీడి నేరుగా రాష్ట్రపతి..ఉపరాష్ట్రపతి..ప్రధాని..స్పీకర్తో పాటుగా న్యాయస్థానానికి సైతం వెళ్లానని కానీ, న్యాయం జరగలేదని వివరించారు. ఏపీ శాసనసభ వేదికగా ఇటువంటి ఫిరాయింపులకు పాల్పిడిన వారి పైన చర్యలు తీసుకొని దేశానికే ఆదర్శంగా ఉండాలని సూచించారు.
సభ నుండి పంపకపోతే..ఆమరణ దీక్ష చేస్తా...
ఫిరాయింపులను ప్రోత్సహించి..వారినే మంత్రులుగా చేసిన చంద్రబాబు మీద చర్యలు తీసుకోవాలని రాంబాబు డిమాండ్ చేసారు. చంద్రబాబు ఏమాత్రం విలువలు ఉంటే తన పదవికి రాజీనామా చేయాలని..వెంటనే తాను చేస్తానని చెప్పుకొచ్చారు. లేకుంటే స్పీకర్ ఆయన పైన చర్యలు తీసుకోవాలన్నారు. సభ నుండి బహిష్కరించాలని డిమాండ్ చేసారు. చంద్రబాబు సభ నుండి వెళ్లకపోతే..ఆయన ఇంటి ముందు ఆమరణ దీక్ష చేస్తానని ప్రకటించారు. జగన్ ముఖ్యమంత్రి అయితే తన నియోజకవర్గం నుండి తిరుపతికి 350 కిలో మీటర్లు కాలినడకన వస్తానని చెప్పానని.. ఇప్పుడు వెళ్తున్నానని వెల్లడించారు. తనకు 2014 ఎన్నికల సమయంలో 10 లక్షలు లేవన్న చంద్రబాబు.. తరువాత కోట్లాది రూపాయాల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఫిరాయింపుల విషయంలో మాత్రం నిర్ణయం తీసుకోకుంటే సభలో ఉండి విలువ ఉండదని ఆవేదన వ్యక్తం చేసారు.
నాడు చేసిందే...నేడు గెలిపించింది..
నంద్యాల ఉప ఎన్నిక సమయంలో జగన్ చెప్పగానే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసానని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి చెప్పారు. సభలో ఆయన తన నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించారు. రాజకీయ నైతిక విలువలకు కట్టుబడి ఎమ్మెల్సీగా గెలిచిన 90 రోజుల్లోనే పదవికి రాజీనామా చేసిన విషయం గుర్తు చేసారు. దేశ చరిత్రలో అతి తక్కువ రోజుల్లో రాజీనామా చేసిన మండలి సభ్యుడిని తానేఅని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం నైతిక విలువలు అనే పదానికి అర్థం లేకుండా చేసిందని.. చట్టాలను చుట్టాలుగా మార్చుకుని అనేక అవినీతి చర్యలకు పాల్పడ్డారని విమర్శించారు.