మరో 25 ఏళ్లు జగనే సీఎం, స్థానిక సంస్థలో వైసీపీ విజయం ఖాయం, విజయసాయిరెడ్డి ధీమా
స్థానిక సంస్థల్లో వైసీపీ విజయం ఖాయమని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, విభేదాలు వీడాలని కోరారు. శనివారం ఆయన విజయనగరం జిల్లాలో పర్యటించారు. స్థానిక సంస్థల్లో పార్టీ విజయానికి శ్రేణులకు కృషిచేయాలని కోరారు. ప్రభుత్వం అవలంభిస్తోన్న సంక్షేమ పథకాలతో జగన్ మరో 25 ఏళ్లు సీఎంగా కొనసాగుతారని జోస్యం చెప్పారు.
స్థానిక సంస్థలను పారదర్శకంగా నిర్వహించాలనే ఉద్దేశంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఆర్డినెన్స్ తీసుకొచ్చారని విజయసాయిరెడ్డి తెలిపారు. మద్యం, నగదు ఏరులై పారొద్దని ఉద్దేశంతో తీసుకొచ్చారని చెప్పారు. ఆయా జిల్లాలకు సంబంధించి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇంచార్జీ మంత్రులు బాధ్యత తీసుకుంటారని చెప్పారు.
ఒకరి నియోజకవర్గంలో మరొకరు కలుగజేసుకోవద్దని విజయసాయిరెడ్డి సూచించారు. ఈ మేరకు సీఎం జగన్ ఆదేశాలు జారీచేశారని పేర్కొన్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు స్వేచ్చను ఇచ్చామని.. దానిని దుర్వినియోగం చేయొద్దని విజయసాయిరెడ్డి సూచించారు.
పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతీ ఒక్కరు కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వారిపై చర్యలు తప్పవని విజయసాయిరెడ్డి హెచ్చరించారు. మరోవైపు ఏపీ స్థానిక సంస్థలకు సంబంధించి శనివారం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.