ఏపీ అసెంబ్లీపై కరోనా కాటు: మరో తొమ్మిదిమందికి పాజిటివ్: ల్యాబుల్లో మరిన్ని రిపోర్టులు
అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి రెట్టింపయింది. రోజురోజుకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వెల్లువలా ముంచెత్తుతున్నాయి. రోజూ వేలల్లో నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ వందల్లో వెలుగులోకి వస్తున్నాయి. ప్రజలను భయాందోళనల్లోకి నెట్టేస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన అయిదారుమంది శాసనసభ్యులకు సోకిన కరోనా వైరస్.. శాసనసభ ఉద్యోగులనూ కాటేస్తోంది. ఇప్పటికే ఎనిమంది శాసనసభ ఉద్యోగులు, ఇతర సిబ్బంది కరోనా బారిన పడ్డారు.
Recommended Video
తాజాగా మరో తొమ్మిదిమందికి వైరస్ సోకింది. ఏపీ అసెంబ్లీ ఉద్యోగులు, సిబ్బందికి పరీక్షలను నిర్వహించారు. వాటికి సంబంధించిన మెడికల్ రిపోర్టులు వెల్లడవుతున్నాయి. సోమవారం నాడు తొమ్మిది మంది అసెంబ్లీ ఉద్యోగులు కరోనా బారిన పడినట్లు నిర్ధారించారు. దీనితో- ఇప్పటిదాకా కరోనా వైరస్ సోకిన అసెంబ్లీ ఉద్యోగుల సంఖ్య 17కు చేరినట్టయింది. మరి కొందరి కరోనా టెస్టులకు సంబంధించిన రిపోర్టులు ల్యాబొరేటరీల్లో ఉన్నాయి. ఆ రిపోర్టులు రావాల్సి ఉంది.
మరోసారి లాక్ డౌన్ లోకి విజయవాడ- ఇవాళ్టి నుంచి ఎక్కడికక్కడ బ్యారికేడ్లు..
ఆ రిపోర్టులు కూడా వస్తే.. పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందనే భయాందోళనలు ఉద్యోగుల్లో వ్యక్తమౌతున్నాయి. ప్రస్తుతం కరోనా వైరస్ బారిన పడిన అసెంబ్లీ ఉద్యోగుల్లో చాలామంది గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. ఈ రెండు చోట్లా వందల కొద్దీ కేసులు నమోదవుతున్నాయి. వాటి ప్రభావంతోనే అసెంబ్లీ ఉద్యోగులు వైరస్ బారిన పడి ఉంటారని చెబుతున్నారు. కృష్ణాజిల్లాలో ఇప్పటిదాకా 3548 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
గుంటూరుజిల్లాలో ఈ సంఖ్య మరింత అధికంగా ఉంటోంది. గుంటూరు జిల్లాలో 4989 కేసులు వెలుగులోకి వచ్చాయి. విజయవాడ కరోనా వైరస్ హాట్స్పాట్గా మారింది. విజయవాడ, మంగళగిరి పరిసరాల్లో అసెంబ్లీ ఉద్యోగులు నివసిస్తున్నారని, అక్కడున్న పరిస్థితుల వల్ల వారికి వైరస్ సోకి ఉంటుందని అంటున్నారు. ఇంకా పలువురు ఉద్యోగుల రిపోర్టులు రావాల్సి ఉండటంతో కరోనా బారిన పడిన ఉద్యోగుల సంఖ్య పెరిగే అవకాశాలు లేకపోలేదని అనుమానిస్తున్నారు.