తనిష్క్ చోరీ: బంధువుల ఇంట్లో రెండో నిందితుడు అరెస్ట్
గుంటూరు: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని తనిష్క్ జ్యువెల్లర్స్ చోరీ కేసులో రెండో నిందితుడు ఆనంద్ను పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో ఆనంద్ పట్టుబడ్డాడు. అక్కడి నుంచి హైదరాబాద్కు తీసుకు వచ్చారు. మంగళగిరిలో బంధువుల ఇంట్లో అతను ఉన్నాడనే సమాచారం వచ్చింది.
దీంతో పోలీసులు దాడి చేసి అతనిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న ఆనంద్ కోసం పోలీసులు సోమవారం నుంచి గాలిస్తున్నారు. సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అతను మంగళగిరిలోని బంధువుల ఇంట్లో ఉన్నట్లు గుర్తించారు. మంగళవారం రాత్రి హైదరాబాదుకు తీసుకు వచ్చి రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు.
ఆనంద్ను కూడా విచారిస్తే చోరీ కేసు విషయాలు బయటకు వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. తనిష్క్ షోరూంలో చోరీకి పాల్పడింది తానేనని కిరణ్ అనే యువకుడు లొంగిపోయిన విషయం తెలిసిందే. అతడి వద్ద నుంచి సుమారు రూ5.98 కోట్ల విలువైన 15.57 కేజీల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ మీడియాకు సోమవారం వివరాలు తెలియజేసిన విషయం విధితమే. గుంటూరు జిల్లా ఈపూరు మండలానికి చెందిన కిరణ్ మూడు నెలల క్రితం జీవనోపాధి కోసం హైదరాబాద్ వచ్చాడు. ప్లంబింగ్తోపాటు ఎలక్ట్రికల్ పనులు చేసేవాడు. కొద్దినెలల క్రితం కిరణ్ పెదనాన్న కుమారుడు ఆనంద్ కూడా హైదరాబాద్ వచ్చాడు. వీరిద్దరు కలిసి దొంగతనం చేశారు.