అది హత్యే!: కొడుకు మృతిపై ఎమ్మెల్యే బాలకృష్ణ గన్మెన్ ఆరోపణ
విద్యార్థుల ముందే ప్రిన్సిపల్ తన కుమారుడిని దారుణంగా కొట్టారని, బూటుకాలితో తన్ని దుర్భాషలాడాడని మోహనకృష్ణ నాయక్ ఆరోపించారు.
తిరుపతి: హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గన్ మెన్ మోహనకృష్ణ నాయక్ కుమారుడి ఆత్మహత్య మరో మలుపు తిరిగింది. తన కుమారుడు సాయి చరణ్ ది ఆత్మహత్య కాదని, హత్యకు గురయ్యాడని ఆరోపిస్తూ తిరుపతి పోలీసులకు మోహనకృష్ణ నాయక్ ఫిర్యాదు చేశారు.
నారాయణ పాఠశాలలో జరిగిన ఈ ఉదంతంపై స్పందించిన యాజమాన్యం.. మెట్లపై నుంచి జారి కిందపడటం వల్లే ప్రమాదవశాత్తు విద్యార్థి మృతి చెందాడని తెలిపింది. తొలుత సాయిచరణ్ ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ.. ప్రమాదం వల్లే మరణించినట్లు స్కూల్ యాజమాన్యం ధ్రువీకరించింది.
అయితే మృతుడి తండ్రి మోహనకృష్ణ నాయక్ మాత్రం కొడుకు మృతి పట్ల అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. తన కుమారుడిని హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించాలని చూస్తున్నట్లు ఆయన ఆరోపిస్తున్నారు. శ్రీనివాసమంగాపురం సమీపంలోని నారాయణ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. సోమవారం రాత్రి పాఠశాలలో స్టడీ అవర్స్ ముగించుకుని భోజనం చేసి భవనంపైకి వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగినట్లుగా స్కూల్ యాజమాన్యం చెబుతోంది.
తండ్రి వాదన ఇలా!:
తన కుమారుడిది ఆత్మహత్య కాదని, నారాయణ పాఠశాల ఒలింపియాడ్ ప్రిన్సిపల్ అంజిరెడ్డే హత్య చేశాడని సాయిచరణ్ తండ్రి మోహనకృష్ణ నాయక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ప్రిన్సిపల్ పై హత్య, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. విద్యార్థుల ముందే ప్రిన్సిపల్ తన కుమారుడిని దారుణంగా కొట్టారని, బూటుకాలితో తన్ని దుర్భాషలాడాడని మోహనకృష్ణ నాయక్ ఆరోపించారు.
విద్యార్థి మృతి నేపథ్యంలో పలు ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు ఆసుపత్రి వద్ద ధర్నాకు దిగాయి. బాధితులకు న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారు. విద్యాసంస్థ గుర్తింపును రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.
కాగా, స్విమ్స్ ఆసుపత్రి వద్ద కుమారుడి మృతదేహాన్ని చూడగానే తండ్రి మోహనకృష్ణ నాయక్ కుప్పకూలిపోయారు. కుమారుడి శవాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. గుండెకు శస్త్రచికిత్స జరిగిన తన భార్యను సోమవారం నాడే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారని, ఇలాంటి పరిస్థితుల్లో కుమారుడు చనిపోయిన విషయం ఆమెకు ఎలా తెలపాలంటూ ఆయన కన్నీటిపర్యంతమయ్యారు.