మరో ఏపీ మంత్రికి కరోనా పాజిటివ్: తిరుపతిలో కరోనా మృతుల బంగారం మాయం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా బారిన పడుతున్న ప్రముఖుల జాబితా పెరుగుతోంది. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, మంత్రులు కరోనా మహమ్మారి బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా మరో రాష్ట్ర మంత్రికి కరోనా సోకినట్లు తెలిసింది.
మరో మంత్రికి కరోనా పాజిటివ్..
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి బోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణకు కరోనా పాటిజివ్ అని తేలింది. ఈ మంత్రి హోంఐసోలేషన్లో ఉన్నారా? లేక ఏదైనా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారా? అనేది తెలియరాలేదు. కాగా, ఈయన ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోపాటు తిరుమల బ్రహ్మోత్సవాలకు హాజరయ్యారు. ఈ వేడుకలకు హాజరైన మరో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్కు కూడా కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. ఈయన కూడా ముఖ్యమంత్రి వెంటే ఉన్నారు.
పలు కార్యక్రమంలో మంత్రి..
కాగా, ఆదివారం అంతర్వేది నూతన రథం నిర్మాణ పనుల ప్రారంభోత్సవంలో, అలాగే జగ్గంపేట మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమంలో కూడా మంత్రి వేణుగోపాల కృష్ణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు, అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఏపీలో కరోనా కేసులు ఎక్కువగానే నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు 6,75,674 కేసులు నమోదు కాగా, 5708 మంది మరణించారు.
కరోనా మృతుల బంగారం మాయం
ఇది ఇలావుండగా, తిరుపతిలో దారుణం చోటు చేసుకుంది. కరోనాతో మృతి చెందినవారిపై ఉండే బంగారు ఆభరణాలను మాయం చేశారు. దీంతో దర్యాప్తు జరిపిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తిరుపతి అర్బన్ ఎస్పీ రమేశ్ హెచ్చరించారు. తిరుపతి స్విమ్స్ ఆస్పత్రలో పనిచేస్తున్న ఓ వార్డు బాయ్, నర్సును పోలీసులు అరెస్ట్ చేశారు. కరోనాతో పోరాడుతూ మృతి చెందిన వ్యక్తి నుంచి వీరు బంగారు ఆభరణాలు మాయం చేశారని పోలీసులు తెలిపారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకున్నట్లు చెప్పారు. నిందితుల నుంచి 4 బంగారు ఉంగరాలు, రూ. 6వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.