తిరుమలలో అందుబాటులోకి రానున్న మరో అథ్భుత మార్గం
తిరుమల:వెంకటేశ్వరస్వామి భక్తులు తిరుమల ఏడు కొండల స్వామి దర్శనం ఎంతో అదృష్టంగా భావిస్తారు. అందుకు తగినట్లే తిరుమల యాత్ర కూడా అంతే మధురంగా పచ్చని ప్రకృతి ఒడిలో...సమున్నత శిఖరాల నడుమ...సొంపైన ఒంపులు తిరుగుతూ...ఆ దేవదేవుని వద్దకు చేర్చే ఆ ప్రయాణం జీవితంలో ప్రతి ఒక్కరికి మరపురాని మధురమైన జ్ఞాపకంగా నిలుస్తోంది.
అయితే అలాంటి మధురమైన యాత్రను మరింత అథ్బుతంగా మార్చేందుకు టిటిడి సంకల్పించింది. ఇంతటి చక్కటి యాత్రలోనూ అప్పుడప్పుడు అపశ్రుతులకు కారణమవుతున్నకొండ చరియలు విరిగిపడే ప్రమాదాలకు ముగింపు పలికేందుకు నడుం బిగించింది. అందుకోసమే ఇప్పుడున్న లింకు దారికి ప్రత్యామ్నాయంగా మరో చక్కటి లింకు కనుమ రహదారి మార్గం అందుబాటులోకి తేనుంది.
ప్రమాదాల నివారణ, వాహనాల రద్దీ తగ్గించే లక్ష్యంతో టిటిడి ఈ నూతన మార్గం నిర్మాణంపై దృష్టి సారించింది. తిరుమల-తిరుపతి మధ్య రాకపోకలు సాగించేందుకు రెండు కనుమ రహదారులున్న సంగతి తెలిసిందే. అయితే తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రెండో కనుమ రహదారి చివర్లో రెండు కిలోమీటర్ల ప్రయాణం ప్రమాదకరంగా ఉంటుందనడంలో సందేహం లేదు. అక్కడ వర్షాకాలంలో భారీ కొండచరియలు విరిగి పడుతున్న సంఘటనలు తరుచూ చోటుచేసుకుంటున్నాయి.
అయితే ఈ బండరాళ్లు కూలకుండా తితిదే రకరకాల ప్రయోగాలు చేసినా అవేమీ ఫలప్రదం కాలేదు. దీంతో టిటిడి ప్రత్యామ్నాయ మార్గంపై దృష్టి సారించక తప్పలేదు. ఆ క్రమంలో మరో లింకు కనుమ మార్గం నిర్మాణమే దీనికి అత్యత్తమ పరిష్కారమని భావించిన టిటిడి ఆ బాధ్యతను దిగ్గజ నిర్మాణ సంస్థ ఎల్అండ్టీకి అప్పగించింది. ప్రస్తుతం రెండు కనుమ రహదారులను కలుపుతూ మోకాళ్లమిట్ట నుంచి లింకు రోడ్డు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇక్కడి నుంచి తిరుమల ముఖద్వారం జీఎన్సీ టోల్గేటు వరకు 3 కి.మీ మేరా మరో రహదారి వేయొచ్చని ఇప్పటికే నిపుణులు తేల్చినట్లు సమాచారం.
అనుకున్నట్లుగా ఈ నిర్మాణం పూర్తయి ఆ దారి అందుబాటులోకి వస్తే భవిష్యత్తులో భక్తులకు అనేక సమస్యలు రాకుండా నివారించవచ్చని టిటిడి భావిస్తోంది. అలాగే దీంతో పాటే మోకాళ్లమిట్ట వద్ద భక్తులు కాలినడకన రాకపోకలు సాగించేందుకు వీలుగా మరొక సొరంగం నిర్మించవచ్చని భావిస్తున్నారట.అ యితే మారిన కాలానికి అనుగుణంగా ఈ రహదారిని అత్యాధునిక సాంకేతికత మేళవింపుతో అందమైన మార్గంగా తీర్చిదిద్దాలని టిటిడి పట్టుదలతో ఉందట. అందుకే నూతన రహదారి నిర్మాణానికి ఆకృతులు, ప్రతిపాదనలు తయారు చేసే బాధ్యతలను ఎల్అండ్టీకి అప్పగించాలని టిటిడి నిర్ణయించిందని, ఆప్రక్రియ ముమ్మరంగా సాగుతోందని తిరుమల జేఈవో శ్రీనివాసరాజు వెల్లడించారు.