గుంటూరు కిడ్నీరాకెట్లో మరో పెద్ద ట్విస్ట్...ఆయూష్ ఆస్పత్రి మీద వేదాంత హాస్పిటల్ ఆరోపణలు
గుంటూరు: గుంటూరు-నర్సరావుపేట కిడ్నీ రాకెట్ కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. ఈ కిడ్నీ రాకెట్ వ్యవహారంలో ఆయుష్ ఆసుపత్రి పాత్రే ఉందంటూ తొలుత ఆరోపణలు ఎదుర్కొన్న వేదాంత హాస్పిటల్ అరోపించడం సంచలనం సృష్టిస్తోంది. మరోవైపు ఈ కిడ్నీ రాకెట్ కేసులో విచారణకు హాజరుకావాలని సాక్షులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
తమ వేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందినట్లు ప్రచారం జరిగిన శివనాగేశ్వరరావు అనే వ్యక్తికి ఆయుష్ ఆస్పత్రిలో కిడ్నీ ఆపరేషన్ జరిగిందని, ఆ ఆపరేషన్ ప్రభుత్వ అనుమతి లేకుండానే జరిగినట్లు వేదాంత ఆసుపత్రి ఎండీ రామకృష్ణ వెల్లడించడం కలకలం రేపుతోంది. శివనాగేశ్వరరావుకు కిడ్నీ ఇచ్చిన దేవరగట్టు గోపి తప్పుడు పత్రాలు సృష్టించాడని చెప్పారు.
గోపి పేరుతో గుంటూరు తహసీల్దార్ కార్యాలయంలో నకిలీపత్రాలు జారీ చేశారని, ఆ విషయమై విచారణ జరిపితే అసలు వాస్తవాలు బైటకు వస్తాయని రామకృష్ణ అంటున్నారు. దురుద్దేశంతోనే రెవిన్యూ అధికారులు తన మామపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అందరికి 2 నెలలకు అనుమతి ఇచ్చే కమిటీ దేవరగట్టు గోపికి వారానికే ఎలా ఇచ్చిందో తేల్చాలని రామకృష్ణ డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు ఈ కిడ్నీ రాకెట్ గురించి వివరాలు చెప్పడానికి తాము సూచించిన తేదీల్లో దర్యాప్తుకు హాజరుకావాలని నర్సరావుపేటకు చెందిన కొందరు వ్యక్తులకు వన్ టౌన్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. కొందరు వాస్తవాలు తెలియకుండా చట్టవిరుద్దంగా ప్రచారం చేస్తున్నారని, అటువంటి వారు చట్టపరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని నర్సరావుపేట పోలీసులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఈ కిడ్నీ రాకెట్ వ్యవహారం నవ్యాంద్ర రాజధానిలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఇప్పటికే కల్తీలకు, నకిలీలకు అడ్డాలుగా పేరుతెచ్చుకున్న గుంటూరు , విజయవాడలే ఈ కిడ్నీల వ్యవహారం లోను కీలక పాత్ర పోషిస్తున్నట్లు వెల్లడవడంతో రాజధాని ప్రాంతానికి అప్రతిష్ట పెరిగిపోతోంది. మానవ ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ కిడ్నీ రాకెట్ వ్యవహారాన్ని ప్రభుత్వం కేవలం పోలీసులకే వదిలేయకుండా పూర్తి స్థాయి విచారణ జరిపించి అసలు దోషులందరిని బైటపట్టాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.