మరో కేసులో ఇరుక్కున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్: ఆ ర్యాలీనే కారణం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ అధికారం కోల్పోయిన నాటినుండి దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పడరాని పాట్లు పడుతున్నాడు. వరుస కేసులలో చిక్కుకుంటూ నానా అగచాట్లు పడుతున్న చింతమనేని ప్రభాకర్ మీద తాజాగా మరో కేసు నమోదైంది.పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నిబంధనలు అతిక్రమించి, అధికారుల అనుమతులు తీసుకోకుండా ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించిన కారణంగా చింతమనేని ప్రభాకర్ పై బుధవారం కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది.
ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించి చింతమనేని ప్రభాకర్ ద్విచక్ర వాహన ర్యాలీ
ఇక ఈ విషయాన్ని ఏలూరు డిఎస్పి డాక్టర్ దిలీప్ కిరణ్ వెల్లడించారు. పెదవేగి మండలం వేగివాడలో టిడిపి కార్యకర్తలతో కలిసి చింతమనేని ప్రభాకర్ ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. అయితే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న కారణంగా ఎవరైనా ర్యాలీ నిర్వహించాలి అంటే ఎన్నికల సంఘం నుండి అనుమతి తీసుకోవడం తప్పనిసరి. కానీ చింతమనేని ప్రభాకర్ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి, అనుమతి తీసుకోకుండా బైక్ ర్యాలీ నిర్వహించారు.
41 ఏ కింద నోటీసులు , చింతమనేనితో పాటు కార్యకర్తలపై కేసులు
దీంతో చింతమనేని ప్రభాకర్ పై, కొంతమంది టీడీపీ కార్యకర్తలపై పెదవేగి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇక ఈ నేపథ్యంలో చింతమనేని ప్రభాకర్ ను , కార్యకర్తలను పెదవేగి పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారణ నిర్వహించిన పోలీసులు ఆయనకు 41 ఏ కింద నోటీసు అందజేశారు. ఏపీలో పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్న సమయంలో కూడా చింతమనేని ప్రభాకర్ పై పోలీసులు నిబంధనల ఉల్లంఘన పేరుతో కేసులు నమోదు చేశారు . ఇప్పటికే ఎస్సీ ,ఎస్టీ అట్రాసిటీ కేసులతో పాటు పదుల సంఖ్యలో కేసులు చింతమనేని ప్రభాకర్ పై ఉన్నాయి.
చింతమనేనిపై పలు సెక్షన్ల క్రింద కేసులు
తాజా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన కేసులో చింతమనేని పై క్రైమ్ నెంబర్ 75 /2021 అండర్ సెక్షన్ 341, 188, 171- సి, 279, 336 , 143, రెడ్ విత్34, 149 , సెక్షన్ 32, ది పోలీస్ యాక్ట్ 1861 కింద నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పంచాయతీ ఎన్నికల సమయంలో ఎవరైనా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి, అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.