పూలు చల్లుకుంటూ..పూలదండలు వేసుకుంటూ: కరోనా వేళ రోజా కలకలం: సొంత పార్టీ నుంచే..!
చిత్తూరు: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యురాలు, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ ఆర్ కే రోజా మరోసారి వివాాదాాల్లో చిక్కుకున్నారు. కరోనా వైరస్ కల్లోలాన్ని సృష్టిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ ఆమె తన అధికార దర్పాన్ని వదులుకోవడానికి ఇష్ట పడనట్టు కనిపిస్తున్నారు. సొంత పార్టీకి చెందిన తోటి ఎమ్మెల్యేలు పారిశుద్ధ్య కార్యక్రమాల్లో నిమగ్నమౌతూ ప్రజల్లో మనో స్థైర్యాన్ని నింపుతోన్న వేళ.. రోజా మాత్రం వారికి పూర్తి భిన్నంగా ప్రవర్తిస్తున్నారడానికి తాజా ఉదాహరణ..ఈ ఘటన.
కరోనా వైరస్ పొంచివున్నప్పటికీ.. దాన్ని ఏ మాత్రం లెక్కచేయకుండా విధి నిర్వహణలో పాల్గొంటున్నారు పారిశుద్ధ్య కార్మికులు. చెత్తను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నారు. బ్లీచింగ్ పౌడర్ను చల్లుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతున్నారు. వారి సేవలకు గుర్తింపుగా ఎమ్మెల్యేలు పారిశుద్ధ్య కార్మికులకు పాదపూజలు చేసిన సందర్భాలు కూడా లేకపోలేదు. వీధుల్లో పారిశుద్ధ్య కార్మికులు వస్తే.. వారిపై పూలు చల్లి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
రోజా మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. కరోనా వైరస్ భయానకంగా విస్తరిస్తోన్న నేపథ్యంలో రోజా తన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. తన సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా నగరిలోని పలు గ్రామాల్లో ఆమె పర్యటిస్తున్నారు. అక్కడిదాకా బాగానే ఉన్నప్పటికీ.. రోజా తన అధికార దర్పాన్ని ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగరి నియోజకవర్గంలోని ఓ గ్రామంలో పర్యటిస్తున్న సందర్భంగా కొందరు స్థానికులు, పారిశుద్ధ్య కార్మికులు ఆమెకు పూలు చల్లి స్వాగతం పలకడం కలకలం రేపుతోంది.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాల్ వైరల్గా మారింది. రాజకీయ ప్రత్యర్థుల చేతికి విమర్శనాస్త్రాలను అందించినట్టయింది. ఇది పాత వీడియో క్లిప్పింగ్ అనే వాదన వినిపిస్తున్నప్పటికీ.. రోజా తన ముఖానికి మాస్క్, చేతులకు గ్లోవ్స్ ధరించి కనిపించారు. ఆమెతో పాటు ఉన్న అనుచరులు, పూలు చల్లుతున్న స్థానికులు కూడా మాస్క్లను ధరించి ఉండటాన్ని బట్టి చూస్తే.. కరోనా విస్తరించిన తరువాత చిత్రీకరించిన వీడియో అనేది స్పష్టమౌతోంది. రోజా తీరుపై సొంత పార్టీ కార్యకర్తలు సైతం అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు.
పూలు చల్లుకుంటూ..పూలదండలు వేసుకుంటూ: కరోనా వేళ రోజా కలకలం: సొంత పార్టీ నుంచే..!#ysrcp #Apgovt #Roja #ysjagan pic.twitter.com/qxr7J3tphF
— oneindiatelugu (@oneindiatelugu) April 21, 2020
Recommended Video
కరోనా విస్తరించిన వేళ.. రోజా ఇలా అధికార దర్పాన్ని ప్రదర్శించడం సరికాదనే అభిప్రాయాన్ని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు సైతం అభిప్రాయపడుతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. శ్రీకాళహస్తి, తిరుపతికి చెందిన సొంత పార్టీ ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూధన్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి స్వయంగా పారిశుద్ధ్య పనుల్లో పాల్గొంటుండగా.. రోజా వారికి భిన్నంగా ప్రవర్తించడం సరికాదనే బహిరంగంగా చెబుతున్నారు.