టెయిల్ పాండ్: ఎపి, తెలంగాణ మధ్య మరో గొడవ, ఎపి లేఖ
గుంటూరు: నదీ జలాలకు, నీటి పారుదల ప్రాజెక్టులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. తాజాగా మరో వివాదం చోటు చేసుకుంది. నోటుకు ఓటు, ఫోన్ ట్యాపింగ్ వంటి వివాదాలు చెలరేగుతున్న సమయంలో ఇది కూడా ముందుకు వచ్చింది.
గుంటూరు జిల్లాలోని రెంటచింతల మండలం సత్రశాల వద్ద నిర్మితమైన టెయిల్పాండ్ పూర్తిగా ఆంధ్రాప్రాంత పరిధిలో ఉంది.అయితే టేల్పాండ్ కూడా తమదే అంటూ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన విషయం తెలిసిందే. దీనికి సంబంధంచి ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం ఓ లేఖ కూడా రాసింది.
రాష్ట్ర విభజన సమయంలో నాగార్జుసాగర్ ప్రాజెక్టు, దాని దిగువన ఉన్న పులిచింతల ప్రాజెక్టును తెలంగాణ నిర్వాహణ కిందికి కేంద్రం తెచ్చింది. అయితే నాగార్జున సాగర్కు దిగువన, పులిచింతలకు ఎగువన ఉన్న సాగర్ టేయిల్పాండ్ నిర్వహణ బాధ్యతను ఏపీకి అప్పగించడంతో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి.
దీనిపై తెలంగాణ రాష్ర్టానికి చెందిన ఇంధనశాఖ కార్యదర్శి అరవింద్కుమార్ ఏపీ ఇంధనశాఖ కార్యదర్శి అజయ్జైన్కు లేఖ రాశారు. టెయిల్పాండ్ నిర్వహణా బాధ్యతలను తమకు అప్పగించి దాని వల్ల వచ్చే విద్యుత్తును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉపయోగించుకోవాలంటూ లేఖలో తెలిపారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు టేయిల్పాండ్ను తమ స్వాధీనంలోకి తెచ్చుకునే అవకాశం ఉందన్న సమాచారంతో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. గురజాల ఆర్డీవో మురళీ ఆదేశాలతో రెంటచింతల ఎమ్మార్వో రాములు నాయక్ 200 మంది పోలీసులతో టేయిల్పాండ్కు చేరుకుని భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.