వర్సిటీ పేరు మార్పు: ఎపి, తెలంగాణ మధ్య మరో గొడవ
హైదరాబాద్: ఆంధ్రా,తెలంగాణ రాష్ట్రాల మధ్య మరో వివాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్ ఎన్జీరంగా విశ్వవిద్యాలయానికి తెలంగాణ ప్రభుత్వం పేరు మార్చింది. జయశంకర్ యూనివర్సిటీగా నామకరణం చేసింది.
జయశంకర్ జయంతి సందర్భంగా నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు యూనివర్సిటీకి వెళ్లి పైలాన్ను ఆవిష్కరించనున్నారు. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. కెసిఆర్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఈ వ్యవహారంపై గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు.
ఏపీ డిప్యూటీసీఎం కెఇ కృష్ణమూర్తి, మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ గవర్నర్ నరసింహన్ కలిసి యూనివర్సిటీ పేరు మార్పు నిర్ణయంపై ఫిర్యాదు చేశారు. విశ్వవిద్యాలయం పేరు మార్పు ఏకపక్షమని గవర్నర్ను కలిసిన తర్వాత కెఇ కృష్ణమూర్తి అన్నారు.
విశ్వవిద్యాలయం పేరు మార్చడం చట్ట విరుద్ధం మాత్రమే కాకుండా రాజ్యాంగ ఉల్లంఘన కూడా అని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పరస్పర అంగీకారం లేకుండా ఏకపక్షంగా వ్యవహరించిందని ఆయన అన్నారు.