ఏపీలో రైతు సంక్షేమం కోసం జగన్ మరో కీలక నిర్ణయం: నేటి నుండే అమలు
ఏపీలోని వైసీపీ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం కరోనా కష్ట కాలంలో కూడా పని చేస్తుంది . ఇప్పటికే రైతు భరోసా అందించి ఆదుకుంటున్న ఏపీ ప్రభుత్వం తాజాగా రైతులకు మేలు చేసేలా మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది . రైతులకు ఖరీఫ్ సీజన్ లో విత్తన కష్టాలు లేకుండా విత్తన సరఫరా చెయ్యాలని భావించిన సర్కార్ నేటి నుండి విత్తన సరఫరాకు శ్రీకారం చుట్టింది .
Recommended Video
గ్రామ సచివాలయాల వద్ద ఖరీఫ్ విత్తనాల పంపిణీ
ఏపీ ప్రభుత్వం గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి విలేజ్ వాలంటీర్లను నియమించిన నాటి నుండి గ్రామ స్థాయిలో ప్రజల అవసరాలను తీర్చటానికి , ప్రభుత్వ పథకాలు క్షేత్ర స్థాయిలో అందేలా చూడటానికి అహర్నిశలు పని చేస్తుంది. గ్రామాలలో ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాల వ్యవస్థను తెగ వాడేస్తున్న ఏపీ ప్రభుత్వం రైతులకు కావాల్సిన విత్తనాలను అందించాల్సిందిగా గ్రామ సచివాలయాలకు బాధ్యత అప్పగించింది. దీంతో నేటి నుంచి గ్రామ సచివాలయాల వద్ద ఖరీఫ్ విత్తనాల పంపిణీ కార్యక్రమం జరగనుంది.
విత్తనకొరత, నకిలీ బాధ లేకుండా ప్రభుత్వమే విత్తన సరఫరా
ఇక రైతులు విత్తనాలు కొనుగోలు చెయ్యటానికి కూడా నానా ఇబ్బందులు పడిన సందర్భాలు అనేకం . నాసిరకం విత్తనాలను షాపుల వాళ్ళు అంటగట్టి తీరా పంట పండకుంటే రైతులు లబో దిబో మన్న సందర్భాలు కోకొల్లలు . ఇక అలాంటి పరిస్థితి రైతులకు ఎదురు కాకుండా ఏపీ ప్రభుత్వం 8 లక్షల క్వింటాళ్లకు పైగా విత్తనాలను సిద్ధం చేసింది. ఇ-క్రాప్ బుకింగ్ ఆధారంగా రైతులకు విత్తనాలు అందజేయనుంది. ఖరీఫ్ పంటకు కావాల్సిన విత్తన సరఫరా చెయ్యనుంది .
సబ్సిడీకే రైతాంగ అవసరాల మేరకు విత్తనాలు
2,28,732 క్వింటాళ్ల వరి విత్తనాలను అందించనున్న ఏపీ ప్రభుత్వం 13 రకాల వరి వంగడాలపై క్వింటాల్కు రూ.500 సబ్సిడీని ఇవ్వనుంది.శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో జాతీయ ఆహార భద్రతా మిషన్ కింద వరి వంగడాలకు సబ్సిడీని రెట్టింపు చేశారు. 88,215 క్వింటాళ్ల జీలుగ, జనుము, పిల్లి పెసర వంటి పచ్చిరొట్ట విత్తనాలను సిద్దం చేసింది. పచ్చిరొట్ట పంటల విత్తనాలపై 50 శాతం సబ్సిడీ ఇస్తుంది. 5,07,599 క్వింటాళ్ళ వేరుశనగ విత్తనాలను రైతులకు ఇవ్వనున్న ప్రభుత్వం వేరుశనగ విత్తనాలపై 40 శాతం సబ్సిడీ ఇవ్వనుంది. ఇక దీని కోసం గ్రామ సచివాలయాల వద్ద విత్తనాల ధరల పట్టికను అధికారులు ఏర్పాటు చేశారు.
రైతు సంక్షేమానికి ఏపీ ప్రభుత్వ తాజా నిర్ణయం
విత్తనాల పేరుతో రైతులు మోసపోకుండా ప్రభుత్వమే విత్తన సరఫరా చెయ్యటం రైతులకు సంతోషం కలిగిస్తుంది . ఈసారి రైతులకు విత్తన సమస్య కానీ, నకిలీ విత్తనాల బెడద కానీ ఉండవని ప్రభుత్వం చెప్తుంది. మొత్తానికి నేటి నుండే ఈ కొత్త నిర్ణయానికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్తుంది. ఇక ప్రభుత్వ భరోసాతో పాటు కాలం కలిసొస్తే రైతులు పంటలు బాగా పండి సంతోషంగా జీవిస్తారు .