దుర్గ గుడిలో మరో వివాదం;దసరా బ్రహ్మోత్సవాల్లో అక్రమాలు; బెదిరింపులపై ఈవో పోలీసులకు ఫిర్యాదు
విజయవాడ:వరుస వివాదాలతో వార్తల్లో కెక్కుతున్న బెడవాడ కనక దుర్గమ్మ ఆలయంలో తాజాగా మరో వివాదం చోటుచేసుకుంది. ఇటీవల జరిగిన దసరా బ్రహ్మోత్సవాల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాల నిర్వాహకులకు జ్ఞాపికల కొనుగోలు విషయంలో చోటుచేసుకున్న అక్రమాలు ఈ వివాదానికి కారణమయ్యాయి.
అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఆలయంలోని నలుగురి సిబ్బందిపై ఆలయం ఈవో కోటేశ్వరమ్మ సస్పెన్షన్ వేటు వేశారు. అయితే అక్రమాల ఆరోపణలతో సస్పెండ్ అయిన ఆలయం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అచ్యుత రామయ్య తనను బెదిరించారంటూ ఈవో కోటేశ్వరమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. మరోవైపు ఈ తాజా వివాదంపై మీడియాలో ప్రముఖంగా వార్తలు వస్తుండటంతో సిఎంవో కూడా ఈ రగడపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది.
ఇటీవల విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయంపై జరిగిన దసరా బ్రహ్మోత్సవాల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలను సైతం నిర్వహించారు. అమ్మవారిపై భక్తితో ఆయా సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎలాంటి పారితోషికం తీసుకోకుండా పాల్గొన్న వారందరికీ జ్ఞాపికలు ఇవ్వాలని దేవస్థానం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో గత నెల 16న కోలాటం ప్రదర్శన ఇచ్చిన బృందంలో సభ్యులకు తలా ఒక మెమొంటో ఇవ్వాల్సి ఉండగా వారందరికీ కలిపి ఆలయం తరుపున ఒకే జ్ఞాపికను అందించారు. వారు ఇదేమిటని అడిగితే మెమొంటోలు లేనందున బృందానికి ఒక్కటే ఇస్తున్నామని చెప్పారు.
అయితే ఈ బృందంలో ఒక బ్యాంకు ఉద్యోగిని కూడా ఉండటంతో ఆమె ఈ విషయం అనుమానం వచ్చి ఏదో తేడా జరిగిందని భావిస్తూ ప్రభుత్వానికి, దేవస్థానం ఈవోకు లేఖ రాశారు. ఈ ఫిర్యాదును సీరియస్ గా పరిగణించిన ఈవో అసలేం జరిగిందని లోతుగా విచారణ జరపగా ఈ వ్యవహారం వెనుక దాగిఉన్న అక్రమాలు వెలుగుచూశాయి. ఒక్కో మెమొంటో రూ.95 చొప్పున సరఫరా చేసేలా ఈ మెమొంటోల కాంట్రాక్టును విజయవాడకు చెందిన జొన్నాదుల రమేశ్ అనే వ్యక్తికి దక్కించుకోగా అతడు ఆ ప్రకారం 1200 జ్ఞాపికలు సరఫరా చేసినట్లు...అయితే అందుకు ఆలయం రూ. 2 వేలు మాత్రమే చెల్లించినట్లు బిల్లు సమర్పించినట్లు గుర్తించారు.
అయితే తాను ఆలయ అధికారుల కోరిక మేరే ఆ విధంగా బిల్లు ఇచ్చానని విచారణ సందర్భంగా అతడు లిఖితపూర్వకంగా అంగీకారపత్రం సమర్పించాడు. దీంతో ఈ విధంగా అక్రమాలకు పాల్పడినవారు ఎవరో ఈవో విచారణ జరిపి దుర్గగుడి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, పీఆర్వో అచ్యుత రామయ్య, ఆ విభాగం సీనియర్ అసిస్టెంట్ సునీత, 'కనకదుర్గ ప్రభ' మాసపత్రిక కో-ఆర్డినేటర్ ఎస్కే సైదా (ఎన్ఎంఆర్) ఈ అవినీతికి పాల్పడినట్లు గుర్తించారు. దీంతో... అచ్యుత రామయ్య, సునీతలపై సస్పెన్షన్ వేటు వేయడంతో పాటు సైదాను విధుల నుంచి తొలగించారు.
అయితే ఈ క్రమంలో అచ్యుతరామయ్య మీడియాతో మాట్లాడుతూ..."నేను దేవాదాయశాఖలో 30 ఏళ్లుగా పనిచేస్తున్నాను. ఏనాడూ అవినీతికి పాల్పడలేదు. జ్ఞాపికల వ్యవహారంలో ఏం జరిగిందో నాకు తెలియదు. మరో నెలరోజుల్లో పదవీ విరమణ చేయనున్న నన్ను ఈవో కావాలనే ఇరికించారు''...అని ఆరోపించడం సంచలనం సృష్టించింది. దీనిపై ఆయన ఈవోతో ఘర్షణకు దిగారని తెలిసింది. ఈ నేపథ్యంలో అచ్యుతరామయ్య తనను బెదిరించారంటూ ఈవో కోటేశ్వరమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయడం వివాదాన్ని మరింత ఫోకస్ చేసింది. ఈ వ్యవహారంపై తాను పూర్తిస్థాయిలో అన్ని విధాలా విచారణ జరిపిన తర్వాతే చర్యలు తీసుకున్నామని ఈవో స్పష్టం చేశారు.
అయితే దుర్గగుడి వివాదంలో అనూహ్యమైన మలుపు చోటుచేసుకుంది. తానే ఈవో కోటేశ్వరమ్మపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఏఈవో అచ్యుతరామయ్య ప్రకటించడం దుమారం రేపుతోంది. మెమొంటోల కొనుగోళ్లలో ఎలాంటి అక్రమాలు జరగలేదని ఆయన స్పష్టం చేశారు. ఈవో కోటేశ్వరమ్మ కావాలనే ఆలయ ఉద్యోగులను టార్గెట్ చేశారని అచ్యుతరామయ్య ఆరోపించారు. ఇటీవల జరిగిన దసరా బ్రహ్మోత్సవాల్లో కూడా ఎమ్మెల్యే ఉమ ప్రోటోకాల్ అమలు విషయమై వివాదం రేగితే అందులోనూ తనను బలిపశువును చేసేందుకు ఆమె ప్రయత్నించారని ఆయన చెబుతున్నారు. అవసరమైతే ఈకో కోటేశ్వరమ్మపై తాను దేవాదాయ కమిషనర్కు ఫిర్యాదు చేస్తానని అచ్యుతరామయ్య తెగేసి చెప్పారు.