ఏపిలో మరో ఎన్నికల పోరు : నెలాఖరుకు ఓటర్ల జాబితా : త్వరలో ఎలక్షన్ షెడ్యూల్..!
Recommended Video
ఏపిలో మరో ఎన్నికల సమరానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టారో తెలియక...పైకి ధీమా వ్యక్తం చేస్తున్న పార్టీలకు మరో పరీక్ష సిద్దంగా ఉంది. హైకోర్టు అదేశాల మేరకు అధికార యంత్రాంగం ఓటర్ల జాబితాను సిద్దం చేస్తోంది. మే 1న జాబితా విడుదల చేయనుంది. ఆ తరువాత ఎన్నికల షెడ్యూల్ విడుదల దిశగా కసరత్తు జరుగుతోంది.
ఏపిలో మున్సిపల్ ఎన్నికలు..
ఏపిలో ఎంతో కాలంగా వాయిదా పడుతూ వస్తున్న మున్సిపల్ ఎన్నికల నిర్వహణ పైన కసరత్తు మొదలైంది. హైకోర్టు అదేశాల మేరకు ఓటర్ల జాబితా విడుదలకు అధికారులు కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ విషయంలో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయటంతో అధికార యంత్రాంగం ముందుకు కదలింది. ఏపిలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని..మే 1 నాటికి ఓటర్ల జాబితా విడుదల చేయాలని హైకోర్టు ఏపి ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో..మే 1న ఓటర్ల జాబితా విడుదలకు రంగం సిద్దం చేస్తున్నారు. దీంతో మున్సిపల్ అధికారులు యుద్ధప్రాతిపదికన ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేశారు. ఓటర్ల జాబితాలను రూపొందించే పనిలోనూ నిమగ్నమయ్యారు.
ఏపిలో 110 మున్సిపాల్టీల్లో పోరు..
ఏపిలో మొత్తంగా 13 కార్పొరేషన్లతో కలిపి 110 మున్సిపాల్టీలు ఉన్నాయి. ఇందులో నాలుగు సెలక్షన్ గ్రేడ్ మున్సిపాల్టీ లు, ఏడు స్పెషల్ గ్రేడ్, 13 మొదటి గ్రేడ్.. 25 సెకండరీ గ్రేడ్, 23 థర్డ్ గ్రేడ్వి కాగా 25 నగర పంచాయితీలు ఉన్నాయి. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల ఓటర్ల జాబితాలను పరిగణనలోకి తీసుకుని మున్సిపల్ ఓటర్ల జాబితా రూపొందిం చాల్సి ఉంటుంది. ఈ మేరకు మున్సిపల్ అధికారులు జిల్లా ఎన్నికల సంఘాల నుంచి సార్వత్రిక ఎన్నికల ఓటర్ల జాబితాలను తీసుకుని జాబితాను రూపొందించే పని ప్రారంభించారు. కాగా, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా రూపొందించేందుకు ఇంకా 12 రోజులే సమయం ఉండటంతో అధికారులు వేగంగా అడుగులు వేస్తున్నా రు. ఇదే సమయంలో గ్రేటర్ మున్సిపాల్టీల్లో కొన్ని చోట్ల విశారు గ్రామాల విలీన సమస్యలు వెంటాడుతున్నాయి. గుంటూరు, విశాఖ నగరాల్లో విలీన సమస్యల పైన కోర్టులో కేసులు నడుస్తున్నాయి.
మే తొలి వారంలో రిజర్వేషన్లు..
ఏపిలోని మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా వెలువడిన తరువాత ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. ఈ ప్రక్రియ ముగిసిన తరువాత ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే, ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసి.. ఫలితాల పై పార్టీలు ధీమాగా ఉన్నాయి. మే 23న ఫలితాలు వెల్లడి కానున్నాయి. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం లోగానే మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు. అయితే, దీనికి సంబంధించి సాంకేతికంగా..న్యాయ పరంగా ఎటువంటి అడ్డంకులు ఎదురుకాకపోతే మే నెలఖరు నాటికి మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.