అంతం కాదిది ఆరంభమే: అచ్చెన్నాయుడుతో మొదలు, మిగతా మాజీ మంత్రులు కూడా
గత ప్రభుత్వ హయాంలో అవినీతి రాజ్యమేలిందని కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ ఆరోపించారు. అందుకు సజీవ సాక్ష్యం అచ్చెన్నాయుడు అని గుర్తుచేశారు. కార్మికశాఖలో రూ.300 కోట్ల అవకతవకలు జరిగినట్టు అవినీతి నిరోధక శాఖ గుర్తించిందని తెలిపారు. ఇందులో రూ.150 కోట్ల అవినీతిలో అప్పటి మంత్రి అచ్చెన్నాయుడు పాత్ర ఉందని... ఈ మేరకు ఆధారాలు కూడా లభించాయని తెలిపారు.
టెలీ సర్వసుల్లో స్కాం చేసి.. తమకేమీ తెలియదన్నట్టు వ్యవహారించారని జయరామ్ ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో కార్మికశాఖ మంత్రులుగా పితాని సత్యనారాయణ, అచ్చెన్నాయుడు పనిచేశారు. కానీ అచ్చెన్నాయుడు హయాంలో అవినీతి జరిగినట్టు ఆధారాలు లభించాయని పేర్కొన్నారు.
కార్మికశాఖే కాదు మిగతా శాఖల్లో కూడా అవినీతి జరిగిందని చెప్పారు. అచ్చెన్నాయుడు తర్వాత.. మిగతా మంత్రులు కూడా జైలుకెళ్లడం ఖాయమని చెప్పారు. అచ్చెన్నాయుడు అరెస్ట్ ఆరంభం కానీ.. మిగతా శాఖల్లో అవినీతి భాగోతం త్వరలో వెలుగుచూస్తుందని చెప్పారు. ఎవరినీ వదిలిపెట్టబోమని జయరామ్ స్పష్టంచేశారు.
అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసేందుకు పోలీసులు గోడదూకి ఇంట్లోకి వచ్చారని అతని సోదరుడు ఆరోపించాడు. తమ వాదనలు కూడా వినకుండా అచ్చెన్నాయుడుని తీసుకెళ్లిపోయారని పేర్కొన్నారు. అర్ధరాత్రి గోడదూకి రావాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. ఎప్పటిలాగే తెల్లవారుజామునే స్నానం చేసి.. రెడీ అయిన తన తండ్రి మంచినీళ్లు కూడా తాగలేదన్నారు. మందులు వేసుకోవాలని చెప్పినా వినిపించుకోలేదని అచ్చెన్నాయుడు కూతురు ఆగ్రహం వ్యక్తం చేశారు.